కుమార స్వామికి పదవీ గండం.. ఐదేళ్లు సీఎంగా వుండాలని నిర్ణయం తీసుకోలేదు..?

శుక్రవారం, 25 మే 2018 (09:23 IST)
కర్ణాటక సీఎం కుమార స్వామికి త్వరలోనే కష్టాలు మొదలయ్యేలా వున్నాయి. సీఎం అయిన కుమారస్వామి ఐదేళ్లూ ఆ పదవిలో ఉంటారా? లేదా అనే ప్రశ్న తలెత్తింది. ఎందుకంటే.. ఆయన్ను ఓ సెంటిమెంట్ వెంటాడుతోంది. ఆ సెంటిమెంట్ ఏంటో కాదు.. కర్ణాటక విధాన సౌథ ముందు ప్రమాణ స్వీకారం చేసిన ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా పూర్తికాలం కొనసాగలేదు. 
 
ఈ విషయాన్ని చరిత్ర చెబుతోంది. గతంలో రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో సాదాసీదాగా ప్రమాణ స్వీకారం నిర్వహించేవారు. కానీ, 1993లో అప్పటి జనతాదళ్ నేత రామకృష్ణ హెగ్డే తొలిసారి విధాన సౌథ ఎదుట ప్రమాణ స్వీకారం చేశారు. కానీ మద్యం కాంట్రాక్టుల ఆరోపణలతో ఏడాదిలోపే పదవిని కోల్పోయారు. అదే ఏడాది మరోమారు ముఖ్యమంత్రి అయినా ఈసారి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో పదవి చేజార్చుకున్నారు.
 
కాగా విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న నేపథ్యంలో ఈ సెంటిమెంట్‌కు ఊతమిచ్చేలా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత పరమేశ్వర సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కుమారస్వామి మాత్రమే ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా వుండాలని తాము నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. 
 
బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇప్పటికి ఇంకా మంత్రి పదవుల పంపకాలపైనా చర్చలు సాగలేదు. ఐదేళ్లూ ఆయనే సీఎం అని తామేమీ అనుకోలేదు. మాకూ అవకాశాలు ఉన్నాయి. అసలు అధికార పంపిణీపై ఇప్పటివరకూ చర్చించలేదని తెలిపారు. ప్రభుత్వం నుంచి సుపరిపాలనను తాము కోరుకుంటున్నామని తెలిపారు. కాగా, చెరో రెండున్నరేళ్లు సీఎం కుర్చీని పంచుకోవాలని కాంగ్రెస్ నుంచి ప్రతిపాదన రాగా, కుమారస్వామి దాన్ని తిరస్కరించినట్టు ఇప్పటికే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు