స్థూపాకారంలో శివలింగం ఎక్కడుంది.. తీర్థరాజం గురించి తెలుసా?

మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (12:34 IST)
దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో అమరకంటక్ కూడా ఒకటి. దీనిని సందర్శిస్తే తప్పక స్వర్గప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. దీనిని తీర్థరాజం అని కూడా పిలుస్తారు. యాత్రాస్థలాలకు రాజు వంటిది కావడంతో ఆ పేరు పెట్టారు. ఈ క్షేత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఆగ్నేయభాగంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ సరిహద్దులో నెలకొని ఉన్నది. 
 
అమరకంటక్ చుట్టూ వింధ్య, సాత్పూరా, మైకల్ పర్వత శ్రేణులు నెలకొని ఉన్నాయి. పురాణాలలో అమరకంటక్‌ను రిక్ష పర్వతం అని పేర్కొన్నారు. ఈ క్షేత్రం 12 కిలోమీటర్ల చుట్టుకొలతతో అలరారుతున్నది. మహత్తరమైన నర్మదా మరియు సోనె నదులు ఇక్కడ ఆవిర్భవిస్తాయి. 
 
కాళిదాసు తన మేఘసందేశం రచనలో అమరకంటక్‌ను అమరకూటంగా పేర్కొన్నట్లు చెబుతారు. పురాణ గాథల ప్రకారం పరమశివుడు త్రిపురను దహించివేసినప్పుడు మూడు అగ్ని శకలాలలో ఒకటి అమరకంటక్‌లో పడింది. అది వేలాది శివలింగాలుగా రూపొందాయి. వాటిలో ఒక లింగం ఇప్పటికీ జ్వాలేశ్వర్‌గా పూజింపబడుతున్నది. 
 
అమరకంటక్‌ను సందర్శించి శివుని ఆలయంలో పూజలు జరిపించిన వారికి స్వర్గప్రాప్తి తప్పకుండా లభిస్తుందని ప్రతీతి. అమరకంటక్ పర్వతాన్ని అధిరోహించిన వారికి పది మార్లు అశ్వమేధయాగం చేసినంత ఫలం లభిస్తుందని పద్మపురాణం ఆది కాండంలో చెప్పబడింది. 
 
భక్తులు నర్మదా నదిలో మునిగి జ్వాలేశ్వరుడిని సందర్శిస్తారు. దేశంలోని పుణ్య నదులలో నర్మదానది ఐదవది. శివునికి, ఈ నదికి లంకె ఉంది. ఈ నది తీరంలో లభించే పెక్కు రాళ్లను శివలింగాలుగా పూజిస్తుంటారు. వీటికి బణలింగాలు అని పేరు. సాధారణంగా స్థూపాకారంలో శివలింగాకృతిలో ఉంటాయి. 
 
జోహిలాకు చెందిన జ్వాలవంతి, మహానది, అమోద్ నదులు అమరకంటక్ పీఠభూమిలో ఆవిర్భవించాయి. అమరకంటక్ నర్మదా నది జన్మస్థానం అయినందున భక్తులు శ్రద్ధతో విశేష పూజలు జరుపుతారు. అమరకంటక్‌ని సందర్శించే యాత్రికులు కపిలధార, నర్మదా ఖండ్ ఆలయాలను కూడా సందర్శిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు