శ్రీకాళహస్తిలో బంగారు ఆభరణాలను తుక్కులో కలిపేస్తున్నారు..!

ఆదివారం, 10 జులై 2016 (11:39 IST)
శ్రీకాళహస్తి ఆలయంలో మొన్న బయటపడిన వ్యవహారం అక్కడ జరుగుతున్న అవినీతి తీవ్రత ఎంతో తెలియజేస్తోంది. హుండీ లెక్కింపు సందర్భంగా బంగారు ఆభరణాలను పనికిరాని తుక్కులో కలిపేసి ఆ తర్వాత బయటకు తరలిస్తున్న వైనం భక్తులను విస్మయం కలిగిస్తోంది. అదే సమయంలో హుండీ లెక్కింపు విధానంలోని లోపాలను ఎత్తిచూపుతోంది.
 
శ్రీకాళహస్తీశ్వరుడి హుండీలో నగదుతో పాటు వెండి, బంగారు ఇతర లోపాలు కూడా కానుకల రూపంలో జరుగుతుంటాయి. హుండీ లెక్కింపు సందర్భంగా వేటికవి వేరుచేస్తుంటారు. వెండిలాగా కనిపించే తెల్లటి లోహం వేరుచేసి కిలోల లెక్కన అమ్ముతుంటారు. ఇక్కడే చేతివాటం ప్రదర్శిస్తుంటారు అక్రమార్కులు. ఆ తుక్కులో వెండి, బంగగారు ఆభరణాలు కలిపేశారట. ఇలా ఎంతకాలంగా జరుగుతోందో కానీ, మొన్న తుక్కును తరలించేటప్పుడు ఈఓ భ్రమరాంబ తనిఖీ చేశారు. లక్షల రూపాయల ఆభరణాల బయటపడ్డాయి. తనిఖీ చేయకుంటే ఆ ఆభరణాలు తుక్కులో కలిసి బయటకు వెళ్లిపోఇ ఉండేవి.
 
హుండీ లెక్కింపు సమయంలో ఆలయ అప్రైజర్‌ (ఆభరణాలు బంగారో కావో.. వెండివో కావో తనిఖీ చేసే నిపుణుడు) అక్కడే ఉంటారు. హుండీ లెక్కించే ఉద్యోగులకు ఏదైనా ఆభరణంపై అనుమానం వచ్చినపుడు అప్రైజర్‌కి చూపించి నిర్థారించుకోవచ్చు. అలా చేస్తున్నారా అనేది అనుమానమే. తుక్కులో కలిపేశారని భావించాల్సి వస్తోంది. అదేవిధంగా తుక్కు కొనుగోలు చేసే వారికి, ఆలయ సిబ్బందికి ఉన్న లింకులు ఏమిటి అనేది కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. అటువైపు నుంచి విచారణ మొదలుపెడితే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.
 
ఇక హుండీ లెక్కింపు విధానంలోని లోపాలను సరిచేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ప్రతిసారి అదే సిబ్బందిని వినియోగించడం వల్ల అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతోంది. అలా కాకుండా ఆలయంలో పనిచేసే మొత్తం ఉద్యోగ కార్మికులను ఒక్కో కౌంటింగ్‌కు కొందరిని ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించవచ్చు. అలాగే తిరుమలలో లాగా భక్తులు కొందరిని హుండీ లెక్కింపులో భాగస్వామ్యులను చేయవచ్చు. లేదా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, కళాశాలల విద్యార్థులు ఇలా ఆలయంతో సంబంధం లేని వారిని లెక్కింపు కోసం ఎంపిక చేయవచ్చు. దీని వల్ల ఇలాంటి అక్రమాలకు అవకాశం ఉండదు. గతంలో అవినీతి అక్రమాలలకు పాల్పడి దొరికిపోయిన కొందరు ఘనులే హుండీ లెక్కింపులో కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాంటి వారిని హుండీ లెక్కింపుకు దూరంగా ఉంచాలి.
 
ప్రస్తుత ఉదంతంపై లోతైన విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేసి విచారణ చేయించాలి. ఎందుకంటే ఇది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం. మొక్కు చెల్లించుకోవడం కోసం హుండీలో వేసిన ఆభరణాలను బయటకు తరలించడం తీవ్రమైన నేరంగా పరిగణించాలి. అలా చేస్తున్న వారికి ఉద్యోగ భయమే కాదు..పాపభీతి కూడా లేదని అర్థమవుతోంది. ఇప్పటికే ఆలయంలో కీలక స్థానాల్లో అక్రమార్కులు తిష్టవేశారన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి ఒకరిద్దరికి స్థానచలనం కలిగించగలిగితే అన్నీ చక్కబడతాయని చెబుతున్నారు. అవినీతి విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న ఈఓ భ్రమరాంబ చర్యలు తీసుకోవడంలోను అంతే చురుగ్గా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి