లంకలో హనుమంతుడు ఎడమకాలు ఎందుకు పెట్టాడంటే...?

మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (12:31 IST)
నూతన వధువు వరుడుతో కలిసి తన అత్తవారింటిలోకి ముందుగా కుడికాలు పెడుతూ గృహప్రవేశం చేస్తుంది. కుడికాలు మోపుతూ ఇంట్లోకి రావడం వలన సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. 
 
ఈ కారణంగానే ఇది తరతరాలుగా ఆచారంగా వస్తోంది. ఇక కేవలం అత్త వారింటికి కోడలు వచ్చే విషయంలోనే కాదు ... ఎవరి బాగు కోరతామో వారి ఇంటికి కుడిపాదాన్ని మోపుతూ ప్రవేశించాలని అంటారు.
 
కుడి పాదం మోపకుండా ఎడమ పాదం మోపుతూ ప్రవేశించడం వలన అక్కడ నిరంతరం గొడవలు ... సమస్యలు కలిసి కాపురం చేస్తాయని పండితులు అంటున్నారు. ఈ కారణంగానే గొడవకి సిద్ధపడి వచ్చేవారు ముందుగా ఎడమపాదం మోపుతూ వస్తారని తెలుస్తోంది. 
 
సీత అన్వేషణలో భాగంగా హనుమంతుడు లంకానగరానికి చేరుకున్నప్పుడు ఈ విషయాన్ని గురించే కాసేపు ఆలోచించాడట. తాను కుడిపాదం మోపుతూ లోపలి ప్రవేశించడం వలన రావణాసురిడికి సకల శుభాలు జరుగుతాయని భావించి, ముందుగా ఎడమ పాదాన్ని మోపుతూ లోపలికి వెళ్లాడట. కాబట్టి ఎక్కడైతే సఖ్యతను, సంతోషాన్ని,. సంపదను ఆశిస్తామో, అక్కడికి కుడికాలు ముందుగా మోపుతూ వెళ్లాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి