దామోదర రాజనర్సింహ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించాలని అనుకుంటున్నానని సినీ హీరో బాలకృష్ణ అన్నారు. బసవతారకం కేన్సర్ ఆస్పత్రి 25వ వార్షికోత్సవం ఆదివారం హైదరాబాద్ నగరంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర గవ్నర్ జిష్టుదేవ్ వర్మ, తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇందులో హీరో బాలకృష్ణ మాట్లాడుతూ, డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనో లేక లాభాలు పొందాలనే ఆశతోనో ఈ ఆస్పత్రిని ప్రారంభించలేదన్నారు. తనకు దామోదర రాజ నరసింహ పేరుతో ఒక సినిమా చేయాలని ఉందన్నారు.
'వ్యక్తిగత నష్టం వల్ల కలిగిన ఆలోచన నుంచి బసవతారకం కేన్సర్ ఆస్పత్రి పుట్టింది. మా అమ్మ కేన్సర్తో మృతి చెందడంతో అందరికీ కేన్సర్ చికిత్స అందించాలని మా నాన్న ఎన్టీఆర్ ఈ వైద్యాలయం ఏర్పాటు చేశారు. 110 పడకలతో మొదలై.. నేడు దేశంలోనే అత్యున్నత ఆస్పత్రుల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. త్వరలోనే 1000 పడకలతో అమరావతిలోనూ కేన్సర్ వైద్యశాల ఏర్పాటు చేస్తాం. మొదటి దశలో 300 పడకలతో ప్రారంభిస్తాం. మాకు అన్నివిధాలుగా సహకారం అందిస్తోన్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు, ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు' అని బాలయ్య అన్నారు.
గవర్నర్ జిష్టుదేవ్ వర్మ స్పందిస్తూ, 'బాలకృష్ణ దాతృత్వం కలిగిన నటుడు, నేత. అందరికీ మంచి వైద్యం అందించాలనేదే బసవతారకం కేన్సర్ ఆస్పత్రి లక్ష్యం. రానున్న కాలంలోనూ పేదలకు మెరుగైన సేవలు అందించాలని కోరుకుంటున్నా' అని అన్నారు
'తెలంగాణలో కేన్సర్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకరం. ఏడాదికి 50 నుంచి 55 వేల మంది కేన్సర్ బారినపడుతున్నారు. ఎం.ఎన్.జె, బసవతారకం ఆస్పత్రులతోపాటు జిల్లాల్లోనూ కేన్సర్ చికిత్స అందించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో నలుదిశలా ఈ వైద్య సేవలు అందించేందుకు నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం' ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ అని తెలిపారు.