అనంత పద్మనాభుని సంపదను లెక్కించవద్దు!: దేవప్రశ్నం

FILE
తిరువనంతపురం అనంతపద్మనాభ స్వామి ఆలయంలో భారీ సంపదను వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఐదు నేలమాళిగల్లోని సంపదను అధికారులు బయటికి తీశారు. అయితే ఆరో నేలమాళిగకు నాగబంధం ఉండటంతో ఆ గదిని సుప్రీంకోర్టు ప్రస్తుతానికి తెరవకూడదని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో అనంత పద్మనాభస్వామి ఆలయంలో బయటపడ్డ సంపద లెక్కింపుపై జ్యోతిష్యం ద్వారా దైవనిర్ణయాన్ని తెలుసుకునేందుకు నిర్వహించిన ‘దేవప్రశ్నం’ ప్రక్రియ గురువారం సాయంత్రంతో ముగిసింది. ఈ ప్రక్రియలో స్వామి సంపద లెక్కింపుకు ప్రతికూల సంకేతాలు వచ్చాయి.

దేవప్రశ్నంలో వ్యతిరేకమైన అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు ఆలయ ప్రాంగణాన్ని సందర్శించిన అనంతరం కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ తెలిపారు.

స్వామివారి సంపదను లెక్కించకూడదని, ప్రదర్శనకు ఉంచకూడదని దేవప్రశ్నం హెచ్చరించింది. అలాగే అనంతుని సంపదను వీడియో, ఫోటోలు తీయడం కూడా చేయకూడదని దేవప్రశ్నం తెలిపింది.

విలువ కట్టలేని బంగారు ఆభరణాలు, వజ్రాలు, ఇతర విలువైన వస్తువులను ప్రదర్శనకు ఉంచడం వల్ల వాటి పవిత్రత పోతుందని జ్యోతిష్యులు తెలిపారు. ఇప్పటివరకు తెరవని నేలమాళిగ ‘బీ’ ని తెరవాలని ప్రయత్నించే వారికి ముప్పువాటిల్లవచ్చునని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి