"శ్రీనివాస, పరాస్సర్వే తస్మాదన్యన్న విద్యతే ఆతస్సర్వం పరిత్యజ్య శ్రీనివాసం సమాశ్రయేత్" సమస్తమూ శ్రీనివాసమయమే, అతని కంటే భిన్నమైంది మరొకటి లేదు. విద్యల్లో కెల్లా వేద విద్య, మంత్రాల్లో ప్రణవం, ప్రియమైన వస్తువుల్లో ప్రాణం, ధేనువుల్లో కామధేనువు, ఆయుధాల్లో వజ్రాయుధం, పక్షుల్లో గరుడుడు, వృక్షాల్లో కల్పవృక్షం తీర్థాల్లో గంగా మాదిరిగా క్షేత్రాలలో తిరుమలేశుని ఆలయం శ్రేష్టమైనది. అందుకే భక్తజనులు శ్రీ వేంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా పూజలందుకుంటున్నాడు.
తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న తరుణంలో రోజుకో అవతారంలో దర్శనమిచ్చే మలయప్ప స్వామిని దర్శించుకునే వారికి సకలసంపదలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. ముఖ్యంగా గరుడోత్సవం, సూర్యప్రభ వాహన సేవలను తిలకించే వారికి సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి.
అలాగే బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున జరిగే చక్రస్నానం తర్వాత ఆ తీర్థంలో మునిగిన భక్తులకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. శాస్త్రోక్తంగా వేదపండితులు నిర్వహించే చక్ర స్నానానికి అనంతరం పుష్కరిణిలో స్నానమాచరించే భక్తులకు పుణ్యఫలితాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు.