ప్రపంచం ఏర్పడటానికి అయిదే అయిదు మూలకాలు చాలని ఋషులు అంటున్నారు. సర్వజీవులు, సమస్త లోకాలు ఏర్పడటానికి కూడా ఈ ఐదు మూలకాలు చాలట. అవే పంచభూతాలు. నిప్పు, నీరు, గాలి, నేల, ఆకాశం. అయితే ఈ అయిదు భూతాలు ఒక నిష్పత్తిలో కలుస్తాయి. ఇలా ఇవి కలిసే విశిష్ట పద్ధతినే 'పంచీకరణం' అంటారు.
ఇల్లు కట్టడానికి సిమెంట్, ఇసుక, రాళ్ళు, స్టీలు ఒక నిష్పత్తిలో కలపినట్టే.. ఈ పంచీకరణంలో ఒక విలక్షణత ఉంటుంది. ఈ ప్రత్యేక ప్రక్రియలో మొదటి పంచభూతాలు సగం, సగం అయిపోతాయి. ఈ అయిదింటిలో విడిపోయిన సగ భాగాలన్నీ, ఒక్కొక్కటీ మళ్లీ నాలుగు భాగాలుగా విడిపోతాయి.
అప్పుడు ఇవి ఒక్కొక్కటి వెళ్ళి వెనక ఉన్న సగ భాగాల్లో కలుస్తాయి. అంటే ఏమవుతుంది? 1/8 ఆకాశాలు నాలుగు, 1/2 వాయువులోకి ఒకటి, 1/2 తేజస్సులోకి ఒకటి, 1/2 జలంలోకి ఒకటి. 1/2 భూమిలోకి ఒకటి కలుస్తాయన్నమాట. ఇలాగే మిగతా నాలుగు భూతాల్లోనూ జరుగుతుంది. ఇలా మొత్తం పంచీకరణం పద్ధతి పూర్తయ్యే సరికి ప్రతి భూతంలోను మిగతా భూత భాగాలు ఆయా నిష్పత్తుల్లో చేరిపోతాయన్నమాట.
అంటే ప్రతి భూతంలోను మిగిలిన నాలుగు భూతాలు కొంచెం కొంచెం ఉంటాయి. నేలలో లాగే, మన దేహంలో కూడా పంచభూతాలు ఇలా పంచీకరణం అయి వుంటాయి. పంచీకరణం ఒక విశిష్ట సృష్టి విధానమని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు.