కంచి క్షేత్ర ప్రాశస్త్యం మీకు తెలుసా!

కంచి క్షేత్ర ప్రశస్తి చెప్పనలవి కానిది. శ్రీరాముడు సీతా వియోగంతో అరణ్యాలలో సంచరిస్తూ కాంచీ నగరానికి విచ్చేశాడు. దేవర్షి అగస్త్యుడు తీర్థాటనం చేస్తూ కంచి నగరాన్ని సందర్శించాడు. బలరాముడు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించాడు. ప్రహ్లాదుడు, విభీషణుడు, పరశురాముడు, రామలక్ష్మణులు, అర్జునుడు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

కాంచీపురంలో సర్వతీర్థం, ముక్తిమంటపం, ఆమ్రవృక్షం, కామాక్షీ దేవి ఆలయం, కామకోటి పీఠం, ఆకాశ శక్తి క్షేత్రం, శివజిత్‌ క్షేత్రం, వరద రాజస్వామి ఆలయం దర్శనీయమైనవి. కంచికి పశ్చిమాన ఉన్న సరస్సు సర్వతీర్థం. ఇది సర్వతీర్థాలకు సమాహార రూపమై సార్థక నామధేయంగా వున్నవి. సర్వ తీర్థ సరస్సు తీరాన ముక్తి మంటపం వున్నది.

కంచిలోని ఏకామ్రేశ్వర ఆలయంలో వేదాలన్నీ మామిడి చెట్టురూపంలో ఆవిర్భవించాయి. నేటికీ ఈ ఆమ్రవృక్షం పూజనీయమైనది. దీనివల్లనే ఇచ్చటి ఈశ్వరునికి ఏకామ్రేశ్వరుడనే పేరు వచ్చింది.

కంచి క్షేత్రంలోని కామాక్షిదేవి ఆలయం శ్రీ చక్ర ఆకృతిలో నిర్మితమై వుంది. దీని మధ్యగా, బిందుస్థానీయంగా సిద్ధాసనంలో, చతుర్భుజరూపిణియై శ్రీ కామాక్షి దేవి ప్రతిష్టితులై ఉన్నారు.

అమ్మవారి విగ్రహానికి ముందు ఆదిశంకరులు సాలగ్రామ శిలపై స్వయంగా లిఖించి, ప్రతిష్టించిన శ్రీ చక్రాధిష్ఠాత్రిగా ఆ పరాశక్తి సూక్ష్మరూపిణిగా దర్శనం ఇస్తున్నది.

కంచిలో ఏ ప్రాణి అయినా ఏ కోరికతో అయినా ధర్మానుష్ఠానం చేస్తే అది ఒక్క పర్యాయమే అయినా కోటి రెట్లుగా ఫలితం ఇస్తుంది. కాబట్టి ఇవి కామకోటి అయింది. కంచిలోని కామరాజ పీఠమే కామకోటి పీఠంగా ప్రసిద్ధమై వుంది. ఇది పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటిగా వుంది.

వెబ్దునియా పై చదవండి