కర్నాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలో సౌపర్ణికా నదీతీరాన దేవాలయ శాస్త్రాలను అనుసరించి వెలసిన అద్భుతమైన నిర్మాణం కొల్లూర్ మూకాంబికా దేవాలయం. ఇక్కడి దేవతకు గల అపారమైన శక్తులు సర్వత్రా వ్యాపితమై దేశం నలుమూలల నుంచి భక్తులు మూకాంబికా దేవాలయానికి పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారి దయకు పాత్రులవుతున్నారు. ప్రశస్తమైన విజయదశమి ఇక్కడ విద్యాదశమిగా నామాంతరం చెందుతుంది. పవిత్రమైన విద్యాదశమినాడు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడకు విచ్చేసి తమ పిల్లల అక్షరాభ్యాసానికి శ్రీకారం చుడతారు.
స్థల పురాణం
కొల్లూర్ లేదా కొలాపురమనే పేరు కొల మహర్షి నుంచి సంక్రమించింది. కంహాసురుని సంహారంలో మహాలక్ష్మి ప్రమేయం కోరిన కొల మహిర్షి ఘోరమైన తపస్సు చేస్తాడు. కొలమహర్షి తపస్సుకు ప్రసన్నురాలైన మహాలక్ష్మి, పరమేశ్వరుని నుంచి అమరత్వ సిద్ధికై తపస్సు చేస్తున్న కంహాసురుని మూగవానిగా మార్చుతుంది. అనంతరం కంహాసురుడు మూకాసురుడనే నామంతో ప్రసిద్ధినొందుతాడు.
మూగవాడైనప్పటికీ కంహాసురుడు తన అసుర గుణాన్ని వదులుకోలేదు సరికదా దేవతలపై తన దాడిని మరింత ఉధృతం చేస్తాడు. హరిహరాదుల చేతిలో తనకు
WD Photo
WD
చావు రాకూడదంటూ మహాశివుని నుంచి పొందిన వరగర్వంతో మూకాసురుని ఆగడాలకు అడ్డు అదుపు లేకుండాపోతుంది. మహాలక్ష్మి తన గణంతో దండెత్తి మూకాసురుని సంహరిస్తుంది. ఆ విధంగా హరిహరాదుల చేతిలో కాకుండా సర్వశక్తి స్వరూపిణి అయిన ఒక స్త్రీ చేతిలో మూకాసురుడు సంహరించబడతాడు.
దేవాలయంలోని ప్రధాన గర్భగుడిలో జ్యోతిర్లింగం రూపంలో కొల్లూర్ మూకాంబికాదేవి కొలువబడుతుంది. శ్రీచక్రంలో త్రిమూర్తులైన బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు వసించిన రీతిగా జ్యోతిర్లింగంలో ఆదిశక్తి కొలువుంటుందని చెప్పబడింది. గర్భగుడిలో ప్రకృతి, శక్తి, కాళీ, లక్ష్మి మరియు సరస్వతి విగ్రహ మూర్తులను మీరు చూడవచ్చు. జ్యోతిర్లింగానికి పశ్చిమ దిశగా పంచలోహలతో అద్భుతంగా రూపొందిన శ్రీదేవి పంచలోహ ఉత్సవ మూర్తి కొలువై ఉంటుంది. శంఖ, చక్రధారియై అభయహస్తాన్ని చూపుతున్న మూకాంబికా దేవి పద్మాసనంలో దర్శనమిస్తుంది.
దేవాలయంలో ప్రదక్షిణ చేస్తుండగా, అంతర ప్రాకారపు దక్షిణ భాగంలో దశభుజ గణపతి భక్తుల విఘ్నాలను తొలగిస్తూ కనిపిస్తాడు. అలాగే పశ్చిమ భాగంలో ఆదిశంకరాచార్యుని తపోపీఠం ప్రతిష్ఠితమై ఉన్నది. తపోపీఠానికి అభిముఖంగా పాలరాతిపై చెక్కబడిన ఆదిశంకరాచార్య విరచితాలతో కూడిన ఆదిశంకరాచార్యుని విగ్రహం ఉన్నది. ఆదిశంకరాచార్యుని విగ్రహం, తపోపీఠాన్ని దర్శించాలని ఆకాంక్షించే భక్తులు దేవస్థాన అధికారుల నుంచి ప్రత్యేక అనుమతిని పొందవలసి ఉంటుంది.
ఇక నైఋతి భాగంలో యజ్ఞశాల, వీరభద్రేశ్వర స్వామి విగ్రహం ఉంటాయి. మూకాసురుని సంహార సమయంలో దేవికి సహాయకునిగా వీరభద్ర స్వామి
WD Photo
WD
వ్యవహరిస్తాడు. వీరభద్రునికి ఇక్కడ విభూతి పూజను నిర్వహిస్తుంటారు. బాహ్య ప్రాకారంలో బలి పీఠం, ధ్వజస్థంభం మరియు దీప స్థంభం ప్రతిష్ఠితమైనాయి. ధ్వజ స్థంభం స్వర్ణ రేకులతో అలంకరించబడింది. కార్తీక మాసంలో అత్యంత వైభవంగా జరిగే దీపోత్సవంలో దీపాలతో దీపస్థంభం ఆకర్షణీయంగా దర్శనమిస్తుంటుంది.
దేవాలయంలో ప్రతి దినం వేలసంఖ్యలో భక్తులకు అన్నదానం జరుగుతుంటుంది. ఇక దేవాలయం వెలుపల, పశ్చిమ వీధిలో త్రయంబకేశ్వరుడు, ఈశ్వరుడు, శృంగేరీ, మరియమ్మ దేవాలయాలు కనిపిస్తాయి. అనేక ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ జయేంద్ర సరస్వతి వేదాధ్యయన కేంద్రంలో విద్యార్థులు వేదాలలో ఉచిత శిక్షణ పొందవచ్చును.
దేవాలయ పర్వదినాలు: విద్య దశమితో పాటు చంద్రమాన ఉగాది, శ్రీరామనవమి, నవరాత్రి, సౌరమాన ఉగాది, మూకాంబికా జన్మాష్ఠమి, వినాయక చవితి, కృష్ణాష్ఠమి, నరక చతుర్దశి పర్వదినాలను దేవాలయంలో ఘనంగా నిర్వహిస్తారు.
కొల్లూర్ చేరుకునే మార్గం:
WD Photo
WD
బెంగుళూరు నుంచి - 500 కి.మీ. మంగుళూరు నుంచి - 135 కి.మీ. ఉడిపి నుంచి - 35 కి.మీ. కుండాపూర్ నుంచి - 40 కి.మీ. ప్రయాణ మార్గాలు - రోడ్డు, రైలు, విమానం మరియు సముద్ర మార్గం సమీప రైల్వే స్టేషన్ - కొండాపూర్ సమీప విమానాశ్రయం - మంగళూరు.