తితిదే ఈవోగా ఉత్తరాది వ్యక్తా.. తెలుగు చదవలేని.. మాట్లాడలేని అధికారి : స్వరూపానంద ఆగ్రహం

సోమవారం, 8 మే 2017 (12:14 IST)
తిరుమల తిరుపతి ఎగ్జిక్యూటివ్ అధికారిగా ఉత్తరాదికి చెందిన ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్‌ను నియమించడంపై శారదా పీఠాధిపతి స్వామి స్వరూపనంద సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తితిదేకు తెలుగు మాట్లాడలేదని.. తెలుగు భాష రాయలేని వ్యక్తిని ఈవోగా ఎలా నియమిస్తారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆయన మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ తితిదే ఈవోగా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని నియమించడం దురదృష్టకరమన్నారు. మాజీ ఈఓ సాంబశివరావును మార్చడం పనికిమాలిన ఆలోచన అని, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు ఈ సంఘటనే నిదర్శనమన్నారు. మాజీ ఈవో నిజాయితీపరుడు అన్నారు. 
 
తెలుగు చదవడం, మాట్లాడటం రాని వారిని ఈఓగా ప్రభుత్వం ఎలా నియమిస్తుందని ప్రశ్నించారు. ఈఓ స్థాయిలో కీలక నిర్ణయాలు తీసుకొనేటప్పుడు ఆగమానికి సంబంధించి సమస్యలు వస్తాయన్నారు. ఉత్తర ప్రాంతంలో ఆగమాలతో సంబంధం లేకుండా భక్తి ఉంటుందన్నారు. టీటీడీకి ఉత్తరాది వ్యక్తిని నియమించడంపై కోర్టుకు వెళతామని, ఇక ముందు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇలాంటి చర్యలు తీసుకోకుండా పోరాటం చేస్తానన్నారు. 

వెబ్దునియా పై చదవండి