కొంతమంది నాయకులు వస్తారు, మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు, ఏదో పదో పాతికవేలు ఇచ్చేసి పబ్బం గడుపుకుంటారు. నేను మాత్రం అలాంటివాడిని కాదు, చెప్పిన పని చేయకపోతే అవసరమైతే ఉప్పాడ వచ్చి మీతో తిట్లు తిని వెళ్తాను తప్పించి అలాంటి బ్యాక్ డోర్ పనులు మాత్రం చేయను అంటూ పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ బహిరంగ సభలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
వైసీపీ నాయకులు మీకు న్యాయం చేస్తాం అని మిమ్మల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటారు.
పారిశ్రామికవేత్తలను బెదిరిస్తే శాశ్వత పరిష్కారం రాదు.
మీకు తలో పాతికవేలు పడేసి వైసీపీ వాళ్ళకి సెటిల్ చేసినందుకు కొంత ముట్టజెప్పి పోతారు. అలాంటి బ్యాక్ డోర్ పనులు నేను చెయ్యను.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం నాడు తను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడలో మత్స్యకార సోదరులను, ఆడపడుచులను కలుసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా మర్చిపోలేదనీ, కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని మరోసారి హామీ ఇస్తున్నానని చెప్పారు. ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యలపై స్పందిస్తూ.. ప్రధానంగా నా దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలపై తీసుకోనున్న చర్యల వివరాలు,
1. సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందిన కాకినాడ జిల్లాకు చెందిన 18 మంది మత్స్యకారులకు పరిహారంగా, వారి కుటుంబాలకు ఒకొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ₹90 లక్షల బీమా ఈరోజు అందించడం జరిగింది.
2. ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిరక్షించేందుకు, సముద్ర కొత్త నుండి ప్రజలను కాపాడేందుకు ₹323 కోట్ల వ్యయంతో, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, వారి సహకారంతో రీటైనింగ్ వాల్ పూర్తి చేసి తీరుతామని హామీ ఇస్తున్నాను..
3. ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణంలో నిర్లక్ష్యం కారణంగా డిజైన్ రూపకల్పనలో నిర్మాణ లోపాలు ఉన్నట్లు గుర్తించాం. ఈ విషయంపై గత నెలలో సైసెఫ్ (CICEF) సంస్థ శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేశారు. దీని కారణంగా బోట్లు తరచుగా ధ్వంసం అవుతున్న విషయం నా దృష్టిలో ఉంది. త్వరలోనే ఈ లోపాల పరిష్కారం కోసం APSDMA సహకారంతో దాదాపు ₹98 కోట్ల వ్యయంతో ఈ డిజైన్ సవరణ పనులు ప్రారంభించనున్నాము.
4. మత్స్యకారులతో... మాట - మంతి కార్యక్రమం నిర్వహించిన సమయంలో నా దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేసేందుకు 100 రోజుల గడువులోగా స్పష్టమైన ప్రణాళికను, ప్రజల ఆమోదంతో అమలు చేయనున్నాము.
5. సముద్ర తీరంలో పారిశ్రామిక కాలుష్యంపై పొల్యూషన్ ఆడిట్ చేపట్టాలని పీసీబీ అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వనున్నారు. 3- 4 రోజుల్లో స్వయంగా తీర కాలుష్య ప్రాంతాల్లో పర్యటించి కాలుష్య తీవ్రత తెలుసుకుంటాను.