అయ్యప్ప భక్తులకు శుభవార్త.. శబరిమల సన్నిధికి 48 కి.మీ దూరంలో ఎయిర్‌పోర్ట్

గురువారం, 20 జులై 2017 (11:46 IST)
అయ్యప్ప భక్తులకు శుభవార్త. కేరళ సర్కారు అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం అయ్యప్ప సన్నిధికి 48 కిలోమీటర్ల దూరంలో ఎయిర్ పోర్టును ఏర్పాటు చేయనుంది. నవంబర్ నుంచి జనవరి మధ్య శబరిమలకు కోట్లాది మంది భక్తులు వస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో కొట్టాయం జిల్లా కంజిరపల్లి తాలూకాలోని చెరువల్లీ ఎస్టేట్‌లో 2,263 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టును నిర్మించేందుకు కేరళ సర్కారు శ్రీకారంచుట్టింది. ఇక ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే, శబరిమల ప్రయాణం మరింత సులువు కానుంది.  
 
ఈ ప్రాంతం రెండు జాతీయ రహదారులకు దగ్గరగా ఉండటంతో పాటు పీడబ్ల్యూడీ రోడ్డుకు దగ్గరగా ఉన్న కారణంగా ఇక్కడ ఎయిర్ పోర్టు నిర్మించాలని కేరళ సర్కారు భావిస్తోంది. ఈ ప్రాంతంలో ఎయిర్‌పోర్టును నిర్మించడం ద్వారా భక్తులు శబరిమలకు మరింత సులువుగా చేరుకునే అవకాశాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. ఇందులో భాగంగా  బుధవారం జరిగిన కేరళ మంత్రివర్గ సమావేశం విమానాశ్రయం నిర్మాణానికి ఆమోదం పలికింది. 
 
కాగా, ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే శబరిమలకు సమీపంలో ఎక్కడ విమానాశ్రయం నిర్మించవచ్చన్న విషయాన్ని నిర్థారించాలని ప్రభుత్వం నిర్ణయించి, మూడు ప్రాంతాలను గుర్తించింది. చివరకు చెరువల్లి ఎస్టేట్‌ను ఎంపిక చేసింది.

వెబ్దునియా పై చదవండి