భక్తులు తగ్గినా శ్రీవారి హుండీ ఆదాయం మాత్రం ఎక్కువే

బుధవారం, 24 జూన్ 2020 (16:59 IST)
అసలే కరోనా. రెండు నెలల పాటు ఆలయం మూసివేత. టిటిడిలో ఉద్యోగులకు జీతాలు ఇస్తారో లేదోనన్న ఒక అనుమానం. 14 వేల మంది కాంట్రాక్ట్ , అవుట్ సోర్సింగ్ కార్మికులు, 7 వేలకు పైగా పర్మినెంట్ కార్మికులు ఉన్నారు. అయితే హుండీ ఆదాయంతోనే అందరికీ జీతాలు. ఆధ్యాత్మిక సంస్థలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సి ఉంటుంది.
 
అయితే కరోనా పుణ్యమా అని ఆలయంలో కైంకర్యాలన్నీ యథావిధిగా సాగాయి కానీ భక్తులను మాత్రం అనుమతించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ కేంద్ర ప్రభుత్వ నిబంధనల సడలింపులతో మళ్ళీ ఆలయం తెరుచుకుంది. ప్రస్తుతం సామాజిక దూరం పాటిస్తూ తక్కువ సంఖ్యలోనే భక్తులు శ్రీవారిని దర్సించుకుంటున్నారు.
 
ఆన్లైన్, ఆఫ్ లైన్లో టిక్కెట్లను టిటిడి అందిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా భక్తులకు త్వరితగతిన దర్సన భాగ్యం లభిస్తోంది. అయితే హుండీ ఆదాయం మాత్రం తగ్గడం లేదు. గతంలో రద్దీ సమయంలోనే ప్రతిరోజు కోటి నుంచి కోటిన్నర వరకు వచ్చేది. ఇక శని, ఆదివారాలైతే మూడు కోట్ల వరకు హుండీ ఆదాయం వచ్చేది.
 
ప్రస్తుతం భక్తుల సంఖ్య తక్కువగానే ఉంది. అయినా సరే హుండీ ఆదాయం అర కోటి వరకు వస్తోంది. నిన్న ఒక్కరోజే స్వామివారి హుండీ ఆదాయం 57 లక్షల రూపాయలు వచ్చింది. ఆలయం తెరిచినప్పటి నుంచి హుండీ ఆదాయం పెరుగుతూనే ఉందని టిటిడి అధికారులు చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా స్వామివారికి మ్రొక్కులు సమర్పించుకోలేని భక్తులందరూ ప్రస్తుతం మ్రొక్కులు సమర్పించుకోవడం వల్లనే హుండీ ఆదాయం పెరుగుతోందంటున్నారు టిటిడి ఉన్నతాధికారులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు