మరో వివాదానికి తెరలేపిన రమణ దీక్షితులు...

సోమవారం, 2 అక్టోబరు 2017 (15:17 IST)
తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరో వివాదానికి తెరలేపారు. తితిదే నిబంధనలను ఆయనే ఉల్లంఘించారు. మహద్వారం నుంచి తన కుమారుడు వెంకరమణ దీక్షితులు, మనువడిని తీసుకెళ్ళారు. నిబంధనల ప్రకారం మహద్వారం నుంచి రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి, గవర్నర్, హైకోర్టు, సుప్రీంకోర్టు ధర్మాసనాలకు సంబంధించిన న్యాయమూర్తులతో పాటు మఠాధిపతులు, పీఠాధిపతులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. 
 
కానీ రమణ దీక్షితులు ఆ నిబంధనను పూర్తిగా పక్కనబెట్టి తన కుమారుడు, మనువడిని ఆలయం నుంచి తీసుకెళ్ళడం ఇపుడు చర్చనీయాంశంతో పాటు... వివాదాస్పదమైంది. రమణ దీక్షితులు కుమారుడు వెంకటరమణ దీక్షితులు ఆలయ అర్చకుడు. రెండు సంవత్సరాల ముందు శ్రీవారి నామాల వ్యవహారంతో ఆయనకు టిటిడి ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చారు. 
 
దీంతో ఆయన విధులకు సక్రమంగా హాజరు కావడం లేదు. విధుల్లో లేకున్న వ్యక్తిని ఎలా ఆలయంలోకి తీసుకెళారన్నది ప్రస్తుతం చర్చకు దారి తీస్తోంది. ఈ వ్యవహారంపై సహచర అర్చకులు, పండితులు మండిపడుతుండగా తితిదే ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. పైగా, రమణ దీక్షతులు తన కుమారుడు, మనువడితో మహద్వారం గుండా ఆలయంలోకి వెళుతుంటే ఓ ఉన్నతాధికారి చూస్తూ మిన్నకుండిపోయినట్టు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు