మత్తుదందాలో తాజా సమాచారం ఏంటంటే.. విచారణలో ఫస్ట్ వికెట్ పూరీదే...

మంగళవారం, 18 జులై 2017 (13:16 IST)
హైదరాబాద్‌లో వెలుగు చూసిన మత్తుదందాలో తాజాగా సమాచారం ఒకటి వెలుగు చూసింది. ఈ కేసులోని ప్రధాన నిందితుడు కెల్విన్‌కు కేవలం టాలీవుడ్ ప్రముఖులతోనే సంబంధాలు ఉన్నాయని భావించారు. కానీ, ఈ సంబంధాలు రాష్ట్ర సరిహద్దులు దాటి బాలీవుడ్ వరకు విస్తరించినట్టు తెలుస్తోంది. అందుకే పూర్తి ఆధారాలు సేకరించేవరకు అన్ని విషయాలు గోప్యంగా ఉంచాలని నిర్ణయించారు. 
 
ఈ అంశంపై సిట్ బృందం అధికారి ఒకరు స్పందిస్తూ ‘కెల్విన్‌ ఫోన్‌ విశ్లేషణలో బాలీవుడ్‌, కోలీవుడ్‌ వాళ్ల సమాచారం లభించింది. దాంతోనే దర్యాప్తు కొనసాగించలేమని చెప్పారు. అందుకే పూర్తి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నట్టు తెలిపారు. 
 
ఇదిలావుంటే డ్రగ్స్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. కొద్దిసేపటి క్రితం సిట్‌ బృందం, ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్లతో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్ అకున్‌ సబర్వాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
 
ఇదిలావుంటే, డ్రగ్స్ స్కామ్‌లో సంబంధం ఉన్న సినీ ప్రముఖులు ఒక్కొక్కరు బుధవారం నుంచి విచారణకు హాజరుకానున్నారు. వీరిలో తొలుత దర్శకుడు పూరీ జగన్నాథ్ విచారణకు హాజరుకానున్నారు. ఆ తర్వాత నటి చార్మీ (20వ తేదీ), 21వ తేదీన ముమైత్ ఖాన్, 22న సుబ్బరాజ్, 23న శ్యాం కె. నాయుడు, 24న హీరో రవితేజ, 26న నవదీప్, 28న నందు, తనీష్‌లు తెలంగాణ ఎక్సైజ్ పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. 

వెబ్దునియా పై చదవండి