తితిదే సేవల కోసం కొత్త యాప్‌: 30 నిమిషాల్లోనే 20వేలకు పైగా టిక్కెట్లు!

శుక్రవారం, 8 జులై 2016 (10:11 IST)
కలియుగ వైకుంఠం, తిరుమల తిరుపతి దేవస్థానంలో అధునాతన టెక్నాలజీ ఉపయోగించుకునేందుకు తితిదే తగిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా టీటీడీ సేవలను మరింత విస్తృతం చేసేందుకు కొత్తగా మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తేనుంది.

గతంలో టికెట్లను పొందాలంటే ఆన్‌లైన్‌లోనూ గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండేది. అయితే తితిదే ప్రవేశపెట్టిన యాప్‌లో సేవా టిక్కెట్లు, గదుల టిక్కెట్లతో పాటు తిరుమలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే సౌకర్యం ఉంటుంది. 
 
ఇంకా ఈ సేవలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు వీలుగా ఇటీవల పోర్టల్ కూడా ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ పోర్టల్‌ ద్వారా ఇటీవల కేవలం 30 నిమిషాల్లోనే 20వేలకుపైగా టికెట్లను భక్తులు పొందగలిగినట్లు తితిదే అధికారులు వెల్లడించారు. 
 
ప్రస్తుతం వివిధ విభాగాల ద్వారా భక్తులకు అందిస్తున్న మౌలిక సౌకర్యాలకు సంబంధించిన బిల్లులు, ఇన్‌వాయిస్‌లు అన్నీ చేతిరాతల ద్వారా సాగుతున్నాయి. ఇందులో అవకతవకలు తొంగిచూస్తున్నాయి. దీనికి బ్రేక్ వేసేందుకు కొత్తగా ఎంటర్‌ప్రైస్‌ రీసోర్స్‌ ప్లానింగ్‌ (ఈఆర్‌పీ)ను అందుబాటులోకి తీసుకురానున్నారు. మూడు నెలల్లో దీన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.

వెబ్దునియా పై చదవండి