తితిదే ధర్మకర్తల మండలి సభ్యులు వీరేనా?

గురువారం, 29 ఆగస్టు 2019 (11:48 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ధర్మకర్తల మండలికి కొత్త సభ్యుల నియామకం దాదాపుగా ఖరారైపోయింది. ఇప్పటికే టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని ఏపీ సర్కారు నియమించింది. ఇపుడు ధర్మకర్తల మండలి సభ్యుల పేర్లు ఖరారైనట్టు సమాచారం. 
 
ఇదే అంశంపై పాలకమండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు. ప్రతిపాదనల్లో ఉన్న పేర్లపై చర్చించి తుది జాబితాకు ఆమోదం తెలిపారని సమాచారం. ప్రస్తుతం పాలకమండలి సభ్యుల సంఖ్య 19 ఉండగా.. ఈసంఖ్యను 25కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గవర్నర్‌ ఆమోదముద్ర వేయగానే సభ్యుల పేర్లు వెల్లడించనున్నారు. 
 
కొత్తగా ఎంపికైన సభ్యుల్లో తమిళనాడు నుంచి ఇండియా సిమెంట్స్‌ ఎండీ ఎన్‌.శ్రీనివాసన్‌, కృష్ణమూర్తి, కర్ణాటక నుంచి కృపేందర్‌ రెడ్డి, సుందర్‌, తెలంగాణ నుంచి ముగ్గురుండనున్నారు. పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వర్‌రావు పేరు వినిపిస్తోంది. ఏపీ నుంచి ఎమ్మెల్యేల్లో యూవీ రమణమూర్తి రాజు -యలమంచిలి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి(కాకినాడ) పేర్లు వినిపిస్తున్నాయి. తుడా ఛైర్మన్‌, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పదవిరీత్యా తితిదే పాలకమండలిలో సభ్యుడుగా ఉండనున్నారు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి భార్య ప్రశాంతిరెడ్డి పేరు వినిపిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు