కామాక్షిదేవి కొలువైన కాంచీపురం

బుధవారం, 2 ఏప్రియల్ 2008 (14:29 IST)
తమిళనాడు రాజధాని చెన్నైకి సుమారు 75 కి.మీ దూరంలోని కాంచిపురంలో మహిమ గల కామాక్షి అమ్మవారు వెలిసింది. భారత దేశంలో ప్రసిద్ధి గాంచిన ఏడు పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా కాంచీపురం చరిత్రకెక్కింది. తమిళనాడులోనే ఉన్నప్పటికీ, ఈ ప్రాంత వాసులు వివిధ భాషలు మాట్లాడుతుంటారు. కాంచిపురంలోని ప్రతి వీధిలో ఓ దేవాలయం ఉంటుంది. అందుకే దీనిని 'ది సిటీ ఆఫ్ ఎ థౌజండ్ టెంపుల్స్‌'గా పిలుస్తారు.

కాంచిపురంలో ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ, వీటిలో సందర్శించాల్సిన ముఖ్యమైన దేవాలయాలు శ్రీ కుమరకోటం, శ్రీ అష్టభుజ పెరుమాళ్ ఆలయం, వరదరాజ ఆలయాలు. ఈ కాంచిపురం రెండు ప్రాంతాలుగా విభజించబడి ఉంటుంది. వీటి పేర్లు విష్ణు కంచి, శివ కంచి కాగా, ఈ రెండు ప్రాంతాల మధ్యలో కామాక్షి అమ్మవారి ఆలయం ఉంటుంది. ఏకాంబరనాధుని దేవాలయం ఉన్న ప్రాంతాన్ని శివకంచి అని, వరదరాజ పెరుమాళ్ దేవాలయం ఉన్న ప్రాంతాన్ని విష్ణుకంచి అని పిలుస్తారు.

ఈ దేవాలయంలో బంగారు బల్లి, వెండి బల్లులు ఉండడం ప్రజలను ఆకర్షించే మరో అంశంగా ఉంది. వీటిని తాకితే అంత వరకు బల్లులు మీద పడిన దోషాలు పోతాయని ప్రజల నమ్మకం. ఈ ఆలయాలలో చెక్కిన శిల్పకళా నైపుణ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. కాంచి మఠంలోని శిల్పశాలలో నేర్పించే శిల్ప కళను నేర్చుకునేందుకు విద్యార్థులు, పెద్దలు ఆసక్తి చూపుతుంటారు. జనవరి, ఏప్రిల్, మే నెలల్లో ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు, గరుడోత్సవాలు, రథోత్సవాలను అతి వైభవంగా నిర్వహిస్తారు. పౌర్ణమి రోజుల్లో, శుక్రవారాల్లో కామాక్షి అమ్మవారిని బంగారు రథంలో ఊరేగిస్తారు.

చీరెలంటే గుర్తుకు వచ్చే కాంచీపురం పట్టు చీరెల గురించి వచ్చే వారం తెలుసుకుందాం...

వెబ్దునియా పై చదవండి