దిష్టి దోషాన్ని నివారించే "అగస్తీశ్వరుడు"

FILE
"రాళ్లు పడినా పర్వాలేదుగానీ... కంటి దిష్టి పడకూడదని" పెద్దలు చెబుతుంటారు. అలాంటి దిష్టిదోష నివారణా క్షేత్రంగా తిరుత్తణి సమీపంలోని నాబళూరు శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం విరాజిల్లుతోంది. భైరవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలోని అగస్తీశ్వరుడు నిత్యం పూజలందుకుంటూ, భక్తులకు తన కరుణా కటాక్ష వీక్షణాలను అందిస్తున్నాడు.

దాదాపు 300 వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ అగస్తీశ్వర ఆలయం అందమైన శిల్పకళలకు దర్పనంగా నిలుస్తోంది. ప్రదోష కాలంలో ఈ ఆలయంలోని చతుర్ పీఠలింగంలో ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. ఇక్కడ వందల ఏళ్ల క్రితం శివుడు లింగమూర్తిగా సాక్షాత్కరించాడనీ... ఆ తర్వాత ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు స్వామివారికి ఆలయాన్ని నిర్మించినట్లు పూర్వీకుల కథనం.

ఆలయ చరిత్ర విషయానికి వస్తే... అగస్త్య మహాముని కాశీ నుంచి గంగాదేవిని, భైరవుడిని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టించాడనీ... అందువల్లనే శివుడు గంగాపార్వతి సమేతమూర్తి ఇక్కడ శ్రీ అగస్తీశ్వరుడిగా భక్తులచే పూజలందుకుంటున్నాడని ప్రతీతి. ఈ ఆలయంలో స్వామివారి సన్నిధి పక్కనే కామాక్షి అమ్మవారి సన్నిది కూడా ఉండటం విశేషం.
ఎర్రటి పుష్పాలతో పూజ..!
ఇక్కడి స్వామి వారికి పసుపు, నూనె పూసి... మిరియాలను తలపై ఉంచి, మంచినూనెతో జ్యోతి వెలిగించి, ఎర్రటి పుష్పాలతో పూజలు చేస్తుంటారు. ఇలా చేయడంవల్ల కంటిచూపుతో ఏర్పడే దిష్టి పూర్తిగా తొలగిపోతుందని భక్తుల నమ్మకం. ఆలయ పూజారులు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తు...


అందుకనే భక్తులు.. కామాక్షి అంబాళ్ సమేత అగస్తీశ్వర స్వామి పేరుతో అమ్మవారిని దర్శించుకుంటుంటారు. ఇక్కడి భైరవస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించినట్లయితే.. దిష్టి తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. కుటుంబ సంక్షేమం, వ్యాపారాభివృద్ధి, వ్యాధి నివారణ, శనిదోష నివారణ, చేతబడుల తొలగింపు... తదితర విషయాల్లో భక్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయిస్తుంటారు.

అగస్తీశ్వర ఆలయంలో పౌర్ణమి రోజున, కృష్ణపక్షం అష్టమి తిథి రోజుల్లోనూ జరిగే భైరవ శాంతి, మహాశాంతి పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటుంటారు. ఆలయంలోని మూలవిరాట్టు శ్రీ అగస్తీశ్వర స్వామి వారికి, అమ్మవారికి నిత్య, మాస, వర్ష పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ప్రతి సోమవారమూ, ప్రతి నెలలో వచ్చే ప్రదోషం రోజుల్లో ప్రత్యేక, విశేష పూజలు జరుగుతుంటాయి.

మహాశివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించే ఈ ఆలయంలో గణపతి, దక్షిణామూర్తి, స్థలవృక్షమైన బిల్వ వృక్ష సన్నిధులుంటాయి. భక్తుల దర్శనార్థం ప్రతిరోజూ ఉదయం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటలవరకూ ఆలయాన్ని తెరచి ఉంచుతారు. ఇక్కడి స్వామి వారికి పసుపు, నూనె పూసి... మిరియాలను తలపై ఉంచి, మంచినూనెతో జ్యోతి వెలిగించి, ఎర్రటి పుష్పాలతో పూజలు చేస్తుంటారు.

ఇలా చేయడంవల్ల కంటిచూపుతో ఏర్పడే దిష్టి పూర్తిగా తొలగిపోతుందని భక్తుల నమ్మకం. ఆలయ పూజారులు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తుండగా.. ఇలా చేస్తే శత్రువులు చేసే చెడు ప్రయత్నాలు విఫలమవుతాయని భక్తులు చెబుతుంటారు. ఇంకా ఈ ఆలయంలో వినాయక చవితి ఉత్సవం, నవరాత్రి, కార్తీక మాస ఉత్సావాలు, సంక్రాంతి, మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి.

ఎలా వెళ్లాలంటే... తిరుత్తణి నుంచి తిరువళ్లూరు వెళ్లే దారిలో, పది కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్మీపురందాకా చేరుకుంటే, ఇక అక్కడినుంచి ఆలయానికి నడచి వెళ్లవచ్చు. లక్ష్మీపురానికి తిరుత్తణి, తిరువళ్లూరు, చెన్నై, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి ప్రతి అరగంటకూ బస్సు సౌకర్యం ఉంటుంది. మరి... దిష్టి దోష బాధితులంతా శ్రీ అగస్తీశ్వరుడిని దర్శించుకుంటారు కదూ...?!

వెబ్దునియా పై చదవండి