మధ్యప్రదేశ్‌లో ఖజురహో నాట్యోత్సవం

మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ సంప్రదాయమైన ఖజురహో నాట్య ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసింది. 10వ శతాబ్దంలోని చందెళ్ల సామ్రాజ్యంలో నాటి రాజులు నిర్మించిన చిత్రగుప్త ఆలయం, విశ్వనాథ ఆలయాల ముందు ఈ నాట్యాలు ప్రదర్శితం కానున్నాయి.

ఇటీవల కాలంలో ఖజురహో నాట్యోత్సవాలు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు దేశవిదేశాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తారు. ఈ ఉత్సవాల ప్రత్యేకత ఏమిటంటే... రమణీయ ఖజురహో శిల్ప సంపద నడుమ ఈ నాట్య ప్రదర్శనలను ఇవ్వడం. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయాలను దేదీప్యమానమైన వెలుగులు విరజిమ్మే లైట్లతో అలంకరించారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. "ఈ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించి అంతర్జాతీయ స్థాయిలో ఓ గుర్తింపును తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. జీవితాలకు దర్పణం లాంటిది ఖజురహో. అంతేకాదు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక.

దీనిని సుప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే క్రమంలో ఈ ఖజురహో నాట్యోత్సవాలను ఏర్పాటు చేస్తున్నాం. దీనిని అంతర్జాతీయ దినోత్సవం గుర్తించాలని అడుగుతున్నాం. ఈ ఎన్నికలు అయిన తర్వాత ఈ విషయంపై కేంద్రాన్ని అడుగుతాం" అని అన్నారు.

ఖజురహో నాట్యోత్సవాలలో కథక్, ఒడిస్సీ, కథాకళి, భరతనాట్యం, కూచిపూడి, మణిపురి నాట్య రీతులను ప్రదర్శిస్తారు. ఈ ఉత్సవాన్ని 1975లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. నాటి నుంచి క్రమంగా ఈ ఉత్సవాలు అందరి మన్ననలూ పొందుతూ విజయవంతంగా ప్రదర్శించబడుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి