నల-దమయంతుల ప్రేమకథ

గురువారం, 30 ఆగస్టు 2007 (12:39 IST)
విదర్భ దేశానికి రాజైన భీముని పుత్రిక దమయంతి మరియు నిషిధ రాజాధిపతి వీరసేనుని కుమారుడు నలుడు. ఒకరి గుణగుణాలను గురించి ఒకరు తెలుసుకుని నలదమయంతులు ప్రేమలో పడతారు. నలుని ఊహాచిత్రాన్ని మదిలో ప్రతిష్ఠించుకుంటుంది దమయంతి. ఈ నేపథ్యంలో దమయంతికి అర్హుడైన వరుని కోసం విదర్భరాజు భీముడు స్వయంవరం ప్రకటిస్తారు. నలునితో పాటు స్వర్గాధిపతి ఇంద్రుడు, వరుణుడు, అగ్ని మరియు యమధర్మరాజు స్వయంవరానికి విచ్చేసి దమయంతిని పరిణయమాడలని ఉవ్విళ్లూరుతారు.

అంతటితో ఆగక దమయంతి ప్రేమకు పరీక్ష పెడుతున్నట్లుగా దేవతలు నలుగురు నలుని రూపంలో స్వయంవరంలో పాలు పంచుకుంటారు. స్వయంవరంలో ఐదుగురు నలమహారాజులు పాల్గొనటాన్ని చూసి విదర్భ రాజసభ విస్తుపోతుంది. ఇటువంటి సంకట సమయంలో ఇష్టదైవాన్ని ప్రార్ధించిన దమయంతి, మదిలో ప్రతిష్ఠించుకున్న తన ప్రియతముడు నలమహారాజు కనులముందు కదలాతుండగా, ఐదుగురిలో తన ఊహకు సరితూగుతున్న నలుని మెడలో వరమాల వేస్తుంది. అతడే అసలైన నలమహారాజు. దమయంతి నిష్కల్మషమైన ప్రేమకు మెచ్చిన దేవతలు నిజరూపాన్ని ధరించి జగతికి ఆదర్శంగా నిలిచిన ఆ ప్రేమజంటను ఆశీర్వదించి అంతర్ధానమవుతారు.

ఇరురాజ్యాల ప్రజల ఆనందోత్సాహాల నడుమ నలదమయంతుల వివాహం అంగరంగవైభోగంగా జరుగుతుంది. శనిప్రభావం ఎంతటి వారినైనా అధోగతి పాల్జేస్తుంది. ఇందుకు నలుడు మినహాయింపు కాదు. శనిప్రభావంతో, సోదరుడైన పుష్కరుని చేతిలో జూదంలో ఒడిపోయిన నలుడు రాజ్యభ్రష్టుడువతాడు. నలదమయంతులు కారణవశాన విడిపోతారు. తొలుత ఒక రాజ ప్రాసాదంలో చెలికత్తెగా చేరిన దమయంతి, అనంతరం తన తల్లిదండ్రల పంచన చేరుతుంది. నలుని జాడ తెలుసుకొనుట కొరకు భీమరాజు దమయంతికి స్వయంవరం ప్రకటిస్తాడు. ఇదిలా ఉండగా దమయంతిని వీడిన నలుడు అడవులలో తిరుగుతుండగా కర్కోటకమనే సర్పం నలుని కాటేస్తుంది.

దీంతో నలుని దేహఛాయ నలుపురంగులోకి మారిపోతుంది. నలుడు కురిపి అవుతాడు. నలుని ఎవ్వరూ గుర్తించలేని పరిస్థితి తలెత్తుంది. బాహుకుని పేరుతో రధసారధిగా మారి విదర్భ రాజ్యానికి చేరుకుంటాడు నలుడు. పవిత్ర ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే దమయంతికి వికృతరూపంలోని నలుని ఇట్టే గుర్తించింది. కలసిన జంట ఆనందానికి అంతేలేదు. శనిప్రభావం తొలగింది. నలుని వికృతరూపం మాయమై నిజరూపం కలిగింది. పుష్కరునితో మరోసారి జూదమాడిన నలుడు కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి దక్కించుకుంటాడు.

దమయంతి కేవలం రూపవతియే కాదు నలుని ప్రేమ పట్ల అచంచలమైన అనురాగాన్ని ప్రదర్శించి నిజమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచింది. స్వయంవరంలో దేవతల సౌందర్యానికి లోనుకాక నలుని వరించింది దమయంతి. అంతేకాక వికృతరూపంలోని నలుని బాహ్యరూపాన్ని కాక అంతఃసౌందర్యానికి ప్రాధాన్యతను ఇచ్చి స్వచ్ఛమైన ప్రేమకు దమయంతి తార్కాణమైంది.

వెబ్దునియా పై చదవండి