కేసీఆర్‌ను పట్టిన ఏలినాటి శని తొలిగిపోయిందట..!

FILE
తెలంగాణ రాష్ట్ర సమితికి ఎన్నికల్లో కలిసిరాకపోవడం, ఆ పార్టీ అధ్యక్షుడు అవమానాలు, ఆరోపణలకు గురికావడం వంటి కార్యాలకు ఏలినాటి శనే కారణమని ఊహాగానాలు వస్తున్నాయి.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తనకు ఏలినాటి పట్టిందని కేసీఆరే స్వయంగా వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ శని సెప్టెంబర్ తొమ్మిదో తేదీ రాత్రి 10.33 గంటలతో ఏలినాటి తొలగిపోయిందని, అలాగే పార్టీని పట్టిన అష్టమాదశ శని కూడా పోయిందని ఇటీవల జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ స్వయంగా పేర్కొన్నట్లు సమాచారం.

ఇకపై తన జాతకంతో పాటు, పార్టీ జాతకం కూడా బాగుంటుందని, తెలంగాణా ఉద్యమాన్ని ఢిల్లీని ప్రభావితం చేసేలా కార్యాచరణ చేయాలని పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. అంతేకాదు.. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినాన్ని సీరియస్‌గా జరపాలని, ప్రజల్లో తెలంగాణపై భక్తిని మరింత పెంచాలని కేసీఆర్ అన్నారు.

మొత్తానికి ఇకపై తెరాసకు మంచి రోజులేనని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తన ఆత్మశాంతి కోసం చెప్పుకుంటున్నారా? లేదా.. నిజంగానే ఆయనకు పట్టిన శని తొలగిపోయిందా? అనే విషయాన్ని చెప్పేందుకు మనమేమీ జ్యోతిష్యులం కాము. కానీ కేసీఆర్, తెరాస పార్టీ భవితవ్యంపై మీ అభిప్రాయాలేమిటో? చెప్పండి.

వెబ్దునియా పై చదవండి