శ్రీవారి భక్తులకు భద్రత.. ప్రతి భక్తుడికి బీమా సౌకర్యం... ఎలా?

ఠాగూర్

ఆదివారం, 29 జూన్ 2025 (09:53 IST)
కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం భద్రత కల్పించేలా తితిదే పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు బీమా సౌకర్యం కల్పించాలని భావిస్తోంది. అలిపిరి నుంచి తిరుమల చేరే వరకు బీమా వర్తింపజేసే అంశంపై పరిశీలిస్తున్నారు. భారీ ప్రీమియం, దాతల సహకారం వంటి అంశాలపై అధికారుల అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమాద మరణాలకు తితిదే 3 లక్షల రూపాయల వరకు పరిహారం ఇస్తున్నారు. 
 
శ్రీవారి దర్శనం కోసం ప్రతి రోజూ సుమారు 70 వేల మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఈ ప్రయాణంలో రెండు ఘాట్‌ రోడ్లు, శ్రీవారి మెట్టు నడక మార్గాల మీదుగా ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లుు అనుకోని ప్రమాదాలు జరగడం, క్యూలైన్లలో ఉన్నపుడు ఆకస్మిక అనారోగ్యానికి గురికావడం, ముఖ్యంగా నడక మార్గాల్లో వన్యప్రాణుల దాడులు వంటి ఆకస్మిక అనారోగ్యానికి గురికావడం, ముఖ్యంగా, నడక మార్గాల్లో వన్యప్రాణుల దాడుల వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి దురదృష్టకర పరిస్థితుల్లో నష్టపోయిన భక్తులకు, వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలనే సదుద్దేశ్యంతో తితిదే ఈ బీమా ప్రతిపాదన ముందుకు తెచ్చినట్టు సమాచారం. 
 
అయితే, ఇంతమంది భక్తులకు ఒకేసారి బీమా సౌకర్యం కల్పించే సాధ్యాసాధ్యాలపై తితిదే పరిశీలిస్తోంది. ఈ ప్రణాళిక చేపడితే ఎదురయ్యే సవాళ్లపై తితిదే అధికారులు దృష్టిసారించారు. ఇంత పెద్ద సంఖ్యలో భక్తులకు బీమా సదుపాయం కల్పించడానికి ముందుకొచ్చే సంస్థలు ఏవి? వారు వసూలు చేసే ప్రీమియం ఎంత ఉంటుంది? ఈ ఆర్థిక భారాన్ని పూర్తిగా తితిదే భరించాలా? లేక దాతల సహకారం తీసుకోవాలా? అనే అంశాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. అన్ని సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు