సింధు విజయంపై 'ఉమ్మి వేస్తాను'! జనానికి హాస్య చతురత, రసజ్ఞత లేవు.. మలయాళ దర్శకుడు

బుధవారం, 24 ఆగస్టు 2016 (15:35 IST)
రియో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు ఒక రజత పతకం సాధించి పెట్టిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సాధించిన విజయంపై ఉమ్ముతానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాలీవుడ్ దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ మాట్లమార్చారు. తన మాటలను వక్రీకరించారంటూ వివరణ ఇస్తూనే... జనానికి హాస్య చతురత, రసజ్ఞత లేవని ఆరోపించారు. 
 
తాజాగా తన ఫేస్‌బుక్ పేజీలో వివరణ ఇచ్చారు. పితృస్వామిక సమాజం ఉన్న భారతదేశంలో సింధును అవమానించాలన్నది తన ఉద్దేశం కాదని వివరించారు. తాను చెప్పినదానిని అర్థం చేసుకోవడానికి కనీసం కొద్ది క్షణాలు ఆలోచించనివాళ్ళు తనను తిడుతున్నారని, అటువంటి పిచ్చి జనాలకు వివరణ ఇవ్వడం విలువలేనిదవుతుందన్నారు.
 
మన పితృస్వామిక దేశంలో యావత్తు మహిళా జాతి కోసం పోరాడి, గెలిచిన అమ్మాయిని అగౌరవపరిచేటంతటి పిచ్చివాణ్ణి కాదని శశిధరన్ అన్నారు. ఆమె సాధించిన విజయం చాలా ఘనమైనదన్నారు. శతాబ్దాల నుంచి అణచివేతకు గురవుతున్న మహిళలు ఉన్న భారతదేశం నుంచి వెళ్ళి ఆమె పోరాడిందని, అత్యంత ఘనమైన ఒలింపిక్స్‌ విజయాల్లో సింధు సాధించిన విజయం కూడా ఒకటి అని పేర్కొన్నారు. అయితే, 'ఉమ్మి వేస్తాను' అనే పదాలను ఏ భావంతో ఉపయోగించారో వివరించలేదు. 

వెబ్దునియా పై చదవండి