రియో ఒలింపిక్స్లో వెండి గెలుచుకున్న బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వివరాల కోసం సెర్చింగ్ ఇంజిన్ గూగుల్లో అత్యధిక మంది వెతికారు. అయితే బంగారం కోసం పీవీ సింధు కోర్టులో కఠోరంగా శ్రమపడితే.. గతంలో సాధించిన విజయాల గురించి గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేయలేదు. ఆమె కులం ఏమిటో తెలుసుకునేందుకు కొంతమంది ప్రయత్నించారు.
గూగుల్ సెర్చ్లో ఆమె కులం కోసం బాగా వెతికారు. గూగుల్ సెర్చ్ బాక్స్లో సింధు కోసం శోధించిన వాటిలో ఆమె కులం థర్డ్ మోస్ట్ సెర్చెడ్ కీవర్డ్గా గుర్తించడం జరిగింది. రియోలో దేశానికి గౌరవం సాధించిపెట్టిన పీవీ సింధు కులం ఏమిటో సెర్చ్ చేసే వారి సంఖ్యే ఎక్కువగా ఉందని.. తద్వారా మన దేశంలో ఇంకా కులంపై గల పట్టు ఏమాత్రం తగ్గలేదని క్రీడా పండితులు అంటున్నారు.
వీరిలో ఏపీ, తెలంగాణ, హర్యానా రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది సింధు వివరాల కోసం గూగుల్లో వెతికినట్లు తెలిసింది. ఇక పీవీ సింధు, పీవీ సింధు విన్స్, పీవీ సింధు కాస్ట్ పేరుతో ఎక్కువ మంది శోధించారు.
ఇదిలా ఉంటే.. రియో ఒలింపిక్స్ ఉమెన్స్ బాడ్మింటన్లో రజత పతకాన్ని సాధించిన సింధు విజయం సాధించడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల నజరానాలు ప్రకటిస్తుండగా అనేక కార్పొరేట్ కంపెనీలు కూడా సింధుకు, ఆమె కోచ్ గోపిచంద్కు బహుమతులు ప్రకటిస్తున్నారు. అయితే వీరందరికి భిన్నంగా పిజ్జాహట్ మాత్రం సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. తమ స్టోర్కు వచ్చి సింధు పేరు చెప్పినవారికి పిజ్జా ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది.