సైనా నెహ్వాల్‌కు ముంబైలో మోకాలికి ఆపరేషన్... తృటిలో కోల్పోయిన ఛాన్స్

శనివారం, 20 ఆగస్టు 2016 (15:31 IST)
భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వల్‌కు శనివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ముంబైలో కుడికాలు మోకాలికి శస్త్రచికిత్స నిర్వహించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ మెమోరియల్ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ జరిగింది. 
 
కాగా, ఈ ఆపరేషన్‌కు ముందు సైనా నెహ్వాల్ ఓ ట్వీట్ చేసింది. ఈ మేరకు వైద్యుల ప్రిస్కిప్షన్‌ను ట్విట్టర్‌లో ఉంచింది. తనకు ఉదయం 6 గంటలకు శస్త్రచికిత్స చేస్తారని.. దాని గురించి ఆలోచనతో నిద్రపట్టడంలేదని.. తన కోసం ప్రార్థించాలని ట్విట్టర్‌లో పేర్కొంది. 
 
ఉక్రెయిన్‌కు చెందిన ప్రత్యర్థి చేతిలో ఓటమిపాలైన సైనా గ్రూప్‌ దశలోనే ఒలింపిక్స్‌ నుంచి వైదొలగాల్సి వచ్చింది. తర్వాత మోకాలు సమస్య ఉందని ప్రకటించింది. ఈ సమస్యను అధికమించి, తిరిగి కోర్టులో రాణించేందుకు వీలుగా ఈ ఆపరేషన్ చేయించుకున్నట్టు పేర్కొంది.

మరోవైపు... షట్లర్ సైనా నెహ్వాల్  త్రుటిలో అరుదైన అవకాశాన్ని కోల్పోయింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలో అథ్లెట్ల సభ్యత్వం కోసం జరిగిన పోటీలో సైనా 1233 ఓట్లు సాధించి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఇందులో తొలి నాలుగు స్థానాల్లో నిలిచినవారు మాత్రమే ఐఓసీ అథ్లెట్ సభ్యులుగా ఎంపికవుతారు. 
 
ఒలింపిక్స్ గ్రామంలో 25 రోజుల క్రితం నిర్వహించిన ఈ ఓటింగ్‌లో బీజింగ్ ఒలింపిక్స్ ఫెన్సింగ్ ఈవెంట్ చాంపియన్ బ్రిట్టా హైడ్‌మన్ (జర్మనీ) 1603 ఓట్లతో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత దక్షిణ కొరియా టేబుల్ టెన్నిస్ ఆటగాడు సుంగ్ మిన్ ర్యూ (1544), హంగేరికి చెందిన మాజీ స్విమ్మర్ డేనియల్ గ్యుర్తా (1469), రష్యా పోల్‌వాల్టర్ ఎలేనా ఇసిన్ బయేవా (1365) తొలి నాలుగు స్థానాల్లో నిలిచి ఐఓసీ సభ్యులుగా ఎంపికయ్యారు. వీరు రాబోయే ఎనిమిదేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు. 

వెబ్దునియా పై చదవండి