టోక్యో ఒలింపిక్స్ : చరిత్ర సృష్టించిన పీవీ సింధు - కాంస్యం కైవసం

ఆదివారం, 1 ఆగస్టు 2021 (18:06 IST)
భారత స్టార్ బ్యాడ్మింటన్, తెలుగు అమ్మాయి. పీవీ సింధు చరిత్ర సృష్టించారు. జపాన్ రాజధాని టోక్యో నగరంలో జరుగుతున్న ఒలింపిక్స్ 2020 పోటీల్లో ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ విశ్వ క్రీడల్లో రెండు మెడ‌ల్స్ గెలిచిన తొలి భార‌త మ‌హిళ‌గా నిలిచింది. 
 
ఆదివారం చైనాకు చెందిన హి బింగ్జియావోతో జ‌రిగిన మ్యాచ్‌లో సింధు 21-13, 21-15 తేడాతో వ‌రుస గేమ్స్‌లో విజ‌యం సాధించింది. దీంతో సింధు ఖాతాలో మ‌రో బ్రాంజ్ మెడ‌ల్ చేరింది. 
 
నిజానికి శనివారం జరిగిన సెమీస్‌లో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ తై జు యింగ్‌ చేతిలో ఓడిన సింధు ఆదివారం ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తగా ఆడింది. పూర్తి ఎనర్జీతో, మంచి ఫుట్‌వర్క్‌తో కనిపించింది. చివరి వరకు అదే ఊపు కనిపించి రెండో సెట్‌ను కైవసం చేసుకున్న సింధు కాంస్యంతో మెరిసింది.  
 
కాగా, 2016 రియో ఒలింపిక్స్‌లోనూ సింధు సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచిన విష‌యం తెలిసిందే. సింధు కంటే ముందు రెజ్ల‌ర్ సుశీల్‌కుమార్ మాత్రమే ఒలింపిక్స్‌లో భార‌త్ త‌ర‌పున రెండు మెడ‌ల్స్ గెలిచాడు. అత‌డు 2008 గేమ్స్‌లో బ్రాంజ్‌, 2012 గేమ్స్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్‌ గెలిచిన విష‌యం తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు