"శ్రీ కృష్ణుడి" నిర్యాణము నాడే "కలియుగ" ప్రారంభం

WD
రాక్షసులను సంహరిస్తూ దుష్ట శిష్ఠరక్షణ కావిస్తూ, కురు పాండవ సంగ్రామంలో అర్జునుడికి రధసారధియై అర్జునిలో ఏర్పడిన అజ్ఞాననాంధకారాన్ని తొలగించుటకు విశ్వరూపాన్ని ప్రదర్శించి గీతను బోధించి తద్వారా మానవాళికి జ్ఞానామృతాన్ని ప్రసాదించిన దివ్యమూర్తి శ్రీకృష్ణుడు.

సుమారు 30 శతాబ్దాలకు పూర్వం అంటే క్రీస్తు పూర్వం 3122లో ద్వారకా పట్టణమునందు కృష్ణభగవానుడు నిర్యాణము చెందినట్లు తెలుస్తోంది. నాటినుండే కలి ప్రవేశముతో "కలియుగం" ఆరంభమైందని ప్రముఖ భాగవోత్తములు చెబుతున్నారు.

అట్టి "గీతాచార్యుడు" కృష్ణ పరమాత్మ జన్మాష్టమినాడు సూర్యోదయమునకు పూర్వమే లేచి, చల్లని నీటిలో "తులసీదళము"లను ఉంచి స్నానమాచరించినట్లైతే సమస్త పుణ్య తీర్థములలో స్నానమాచరించిన పుణ్యఫలాన్ని పొందుతారని పురోహితులు అంటున్నారు.

ఇంకా కృష్ణాష్ఠమి రోజున మనమందరం గృహాల ముందు ముత్యాల ముగ్గులతో, పచ్చని తోరణాలతో కృష్ణపాదాలు రంగవల్లికలతో తీర్చిదిద్ది ఆ కృష్ణ పరమాత్మను ఆహ్వానం పలుకుదాం.

అంతేకాదు.. శ్రీ కృష్ణాష్టమి రోజున

కృష్ణ! త్వదీయ పదపంకజ పంజర్తానం
అద్వైవమే విశతు మానసరాజహంసః ||
ప్రాణ ప్రయాణసమమే కఫవాత పిత్తై
కంఠావరోధనవిదే స్మరణ కుతస్తౌ||

తాత్పర్యం: మరణసమయాన నిన్ను స్మరించుచు నీలో ఐక్యమవ్వాలనే కోరిక ఉన్నది కాని.. ఆ వేళ కఫవాత పైత్యములచే కంఠము మూతపడిపోయి నిన్ను స్మరించగలనో? లేనో? అని ఇప్పుడే నా "మానస రాజహస"ను శతృ అబేధ్యమైన "నీ పాద పద్మ వజ్ర పంజర" మందు ఉంచుతున్నాను తండ్రీ.. అని ప్రార్థించిన వారికి ముక్తితో పాటు పుణ్యఫలాలు సిద్ధిస్తాయని విశ్వాసం.

అందుచేత పరమ పుణ్యదినమైన శ్రీ కృష్ణ జన్మాష్టమి నాడు విశేషార్చనలు జరిపించి కృష్ణభగవానుడి ఆశీస్సులతో పునీతులవుదాం..

వెబ్దునియా పై చదవండి