ప్రత్యేక రాజ్యంగా తెలంగాణ.. టీడీపీ లేకుండా చేయాలని కుట్ర : ఎల్ రమణ

మంగళవారం, 27 నవంబరు 2018 (12:29 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నుంచి తెలంగాణ ప్రాంతం వేరుపడిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఒక ప్రత్యేక రాజ్యంగా భావించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ పాలన సాగించారని టిటిడిపి అధ్యక్షుడు ఎల్‌ రమణ ఆరోపించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే దానిని తన కుటుంబ సభ్యులకు అన్వయించుకున్నారన్నారు. నాలుగు కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని కేసీఆర్ వమ్ము చేశారని మండిపడ్డారు మంత్రులకు, శాసనసభ్యులకు, చివరకు తనను ఎన్నుకున్న ప్రజలకు కూడా సమయం ఇవ్వని ముఖ్యమంత్రి కేసీఆర్ అని రమణ విమర్శలు గుప్పించారు. 
 
హైదరాబాద్‌లో మంగళవారం మీట్‌ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్‌పై విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయడానికి కేసీఆర్ కుట్రలు పన్నారని, ఎంతగానో ప్రయత్నించారన్నారు. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్‌ హైదరాబాద్‌ నడిబొడ్డున స్థాపించారని గుర్తుచేశారు. 
 
అన్ని పార్టీలతో కలిసి పాలన అభివృద్ధి సాధిస్తానని చెప్పిన కేసీఆర్ అన్ని పార్టీలను టిఆర్‌ఎస్‌లో కలుపుకొన్నారంటూ ఆయనపై రమణ నిప్పులు చెరిగారు. 30 మంది శాసనసభ్యులను ప్రలోభపెట్టి తన పార్టీలో చేర్చుకున్న రాజకీయ కుసంస్కారి అంటూ ఆగ్రహించారు. సమస్యలపై నిరసన తెలిపే అవకాశం లేకుండా ధర్నా చౌక్‌ను తొలగించారన్నారు. కేసీఆర్ కుటుంబ పెత్తనాన్ని ప్రజలపై రుద్దుతున్నారని రమణ ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు