కేసీఆర్కు టి. ఉద్యోగుల సెగ: అందుకే ఆమరణ దీక్ష ఆలోచన
మంగళవారం, 20 సెప్టెంబరు 2011 (15:22 IST)
FILE
సకలజనుల సమ్మె బ్రహ్మాండంగా సాగుతోందని చెపుతున్న తెరాసకు వెనుక నుంచి మెల్లగా సెగ మొదలైందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగులకు జీతాలు చెల్లించకూడదని ప్రభుత్వం నిర్ణయించిన నేపధ్యంలో ఉద్యోగుల కుటుంబాలు సమ్మెలో పాల్గొంటున్నవారిపై మండిపడుతున్నట్లు సమాచారం.
రాజకీయ నాయకులు తాము చేయాల్సిన పనులు ఉద్యోగుల నెత్తిపై వేసి వారు సంతోషంగా తమ పబ్బం గడుపుకుంటున్నారనీ, ఎటొచ్చి సర్కారీ ఉద్యోగాన్ని నమ్ముకుని పొట్ట చేతపట్టుకుని బతుకులీడుస్తున్న తమకెందుకీ గొడవని వారు గట్టిగా వాదిస్తున్నట్లు సమాచారం.
రాజకీయ పార్టీలు ఎవరి స్వార్థం వారు చూసుకుంటూ పార్టీల వారీగా ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు తప్పించి, ఎవరికీ తెలంగాణా సాధనపై చిత్తశుద్ధి లేదని వారు చెపుతున్నారు. ప్రభుత్వం అన్నమాటను తు.చ తప్పకుండా పాటిస్తే తెలంగాణా ప్రాంత ఉద్యోగుల కుటుంబాలు వచ్చే నెల ఒకటో తారీఖు తర్వాత కటకటలాడిపోవడం ఖాయం.
ఈ నేపధ్యంలో కేసీఆర్ పై ఉద్యోగుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. తెలంగాణా ప్రాంత ఉద్యోగుల్లో ఈ నిరసన బహిర్గతం కాక మునుపే ఆమరణ నిరాహార దీక్షకు దిగితే అన్నీ సర్దుకుంటాయన్న ఆలోచనలో తెలంగాణా రాష్ట్ర సమితి ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద కేసీఆర్ తనదైన శైలిలో తెరాసను తెలంగాణా ఉద్యమంలో పతాక శీర్షికన నిలబెట్టడంలో కృతకృత్యులవుతున్నారు.