మూడో కాన్పు పేరుతో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ... కుర్చీలోనే ప్రసవించిన మహిళ

ఠాగూర్

శుక్రవారం, 23 ఆగస్టు 2024 (17:34 IST)
ఓ మహిళ పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఓ మహిళ ఆరు బయట కుర్చీలోనే ప్రసవించారు. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని నేరడుగొమ్మ మండలానికి చెందిన నల్లవెల్లి అశ్విని అనే గర్భిణికి గురువారం రాత్రి పురిటినొప్పులు రావడంతో దేవకొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆ సమయంలో అక్కడ వైద్యులు లేకపోవడంతో నల్గొండలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్య సిబ్బంది రిఫర్ చేశారు. 
 
దీంతో దేవరకొండ నుంచి అశ్వినిని ఆమె కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఆస్పత్రి సిబ్బంది వారిని ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ దుర్భాషలాడారు. మూడో కాన్పు అంటున్నారు కనుక దేవరకొండలోనే చేయించక ఇక్కడి దాక రావడం అవసరమా? అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. వైద్యులు అందుబాటులో లేరని అందుకే ఇక్కడకు వచ్చినట్టు వారు చెప్పారు. అయినప్పటికీ నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది ఏమాత్రం వినిపించుకోలేదు. 
 
అశ్వినిని కుర్చీలో ఆరుబయటే కూర్చోబెట్టారు. నొప్పులు వస్తున్నాయని చెప్పినా నర్సుల్లో ఏమాత్రం చలనం కనిపించలేదు. ఈ క్రమంలో అశ్విని కుర్చీలోనే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం కూడా అయింది. ఆ తర్వాత నర్సులు హడావుడిగా వచ్చి ఆమెపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోపలికి తీసుకెళ్లారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. 
 
ఈ విషయం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ పూర్ణ చందర్ వెంటనే ఆస్పత్రి వద్దకు చేరుకుని అసలేం జరిగిందో అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బాధ్యులపై తప్పక చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు, ఆ మహిళ భర్త మాత్రం తన భార్య పట్ల నిర్లక్ష్యం వహించిన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు