సీఎం రేవంత్ రెడ్డికి చిక్కులు తప్పవా? ఓటుకు నోటు కేసులో నోటీసులు

ఠాగూర్

శనివారం, 10 ఫిబ్రవరి 2024 (10:54 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డికి చిక్కులు తప్పేలా లేవు. గతంలో చోటుచేసుకున్న ఓటుకు నోటు కేసులో ఆయనకు సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీచేసింది. పదేళ్ల క్రితం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు రేవంత్ రెడ్డి యత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేసే విషయంపై శుక్రవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. 
 
ఈ కేసు విచారణను తెలంగాణ రాష్ట్రం నుంచి మధ్యప్రదేశ్ లేదా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి రాష్ట్రానికి తరలించాలని భారత రాష్ట్ర సమితి నేతలు జగదీశ్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, సత్యవతి రాథోడ్, మహమ్మద్ అలీలు గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నందున కేసును ప్రభావితం చేస్తారని... దర్యాప్తు పారదర్శకంగా జరగదనే అనుమానాలను వారు పిటిషన్‌లో వ్యక్తం చేశారు. 
 
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య బెంచ్... రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నోటీసులపై నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్న సమయంలో... 2015లో ఈ కేసు నమోదైంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌ను రేవంత్ రెడ్డి కలిసి డబ్బులు ఇస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మరోసారి ఈ కేసు తెరపైకి రావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు