చండీగఢ్ మేయర్ ఎన్నిక తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తే...

ఠాగూర్

మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (13:25 IST)
ఇటీవల చండీగఢ్ మేయర్ ఎన్నిక నిర్వహణ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించింది. ఎన్నిక సందర్బంగా పోలైన బ్యాలెట్లు, మొత్తం వీడియోను భద్రపరచాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మానసం ఆదేశాలు జారీచేసింది. ఈ మేయర్ ఎన్నికల్లో ఎన్నికల నిర్వహణాధికారి స్వయంగా అవకతవకలకు పాల్పడ్డారని, అందువల్ల ఈ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ పంజాబ్ - హర్యానా హైకోర్టును ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ ఒకరు హైకోర్టును ఆశ్రయించారు. కానీ, అక్కడ చుక్కెదురైంది. దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 
 
దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం... మేయర్ ఎన్నికను రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని పిటిషనర్ కోరారు. దీనిపై చండీగఢ్ నగరపాలక సంస్థకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నిక జరిగిన తీరుపై వీడియోను వీక్షించి ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్యాలెట్ పత్రాలపై రిటర్నింగ్ అధికారి మార్పులు చేసినట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని పేర్కొంది. "ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే. జరిగినదానిపై మేం దిగ్భ్రాంతి చెందాం. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడాన్ని అనుమతించేదే లేదు. ఆధారాలన్నీ భద్రంగా ఉంచాలి. చండీగఢ్ నగరపాలక సంస్థ తదుపరి సమావేశాన్ని వాయిదా వేసుకోవాలి" అని సీజేఐ ఆదేశించారు. 
 
కాగా, జనవరి 30న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ - ఆప్ కూటమిపై భాజపా విజయం సాధించినట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దీంతో బీజేపీ కౌన్సిలర్ మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో భాజపాకు 16 ఓట్లు, ఈ కూటమి 12 ఓట్లు తెచ్చుకోగా ఎనిమిది ఓట్లు చెల్లకుండా చేయడంపై ఆరోజే వివాదం చెలరేగగా, ఇపుడు సుప్రీంకోర్టు చెంతకు చేరింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు