ఢిల్లీ లిక్కర్ స్కామ్ : కేసీఆర్ కుమార్తెకు సీబీఐ నోటీసులు

వరుణ్

గురువారం, 22 ఫిబ్రవరి 2024 (07:55 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ అధికారులు మరోమారు నోటీసులు జారీచేశారు. ఈ కేసులో విచారణ నిమిత్తం ఈ నెల 26వ తేదీన ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చారు. గతంలో సీబీఐ విచారణ సందర్భంగా తనను ఇంట్లోనే విచారించాలంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈలోపే సీబీఐ కవితకు నోటీసులు జారీ చేసింది. దీంతో, కవిత న్యాయనిపుణులను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది.
 
ఢిల్లీ మద్యం అమ్మకాల పాలసీలో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ తొలుత కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని సీబీఐ కేసులో పేర్కొంది. మరోవైపు, నిధుల మళ్లింపు ఆరోపణలపై ఈడీ కూడా సమాంతరంగా మరో దర్యాప్తు ప్రారంభించింది. గతేడాది ఫిబ్రవరి 26వ తేదీన అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియాను అరెస్టు చేశారు. అదేసమయంలో ఈ కేసులో కవితపై కూడా సీబీఐ ఈడీ ఆరోపణలు పేర్కొన్నారు. కవిత చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, అరుణ్ రామచంద్ర పిళ్లై, శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లిలను కూడా ఈడీ అరెస్టు చేసింది.
 
అయితే, మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి అప్రూవర్లుగా మారగా వారిద్దరికీ బెయిల్ మంజూరైంది. తన భార్యకు ఆరోగ్యం బాగాలేదని రామచంద్ర పిళ్లై అభ్యర్థన మేరకు న్యాయస్థానం అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మిగతావారు జైల్లోనే ఉన్నారు. ఇక దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు హైదరాబాదు వచ్చి కవితను ఆమె ఇంట్లోనే ప్రశ్నించారు. ఈడీ అధికారులు మాత్రం ఆమెను ఢిల్లీలో విచారించారు. అయితే, మహిళను ఆమె ఇంట్లోనే విచారించాలన్న వెసులుబాటు చట్టంలో ఉందంటూ కవిత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అందుకే ఆమె సుప్రీంను ఆశ్రయించారు. ఈలోపు ఈడీ నోటీసులు జారీచేయడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు