ఈ నెల 27 లేదా 29 తేదీల్లో వంట గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభం!!!

వరుణ్

గురువారం, 22 ఫిబ్రవరి 2024 (17:53 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు ఎన్నికల హామీల్లో ఇప్పటికే మూడు హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసింది. మరో రెండు గ్యారెంటీల అమలకు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, గృహజ్యోతి, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ పథకాలను కూడా అమలు చేసే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం సంబంధిత శాఖా అధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఈ రెండు పథకాలను ఈ నెల 27 లేదా 29వ తేదీల్లో అమలు చేయాలన్న ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా, వంట గ్యాస్ సిలిండర్ లబ్దిదారులకు సబ్సిడీ ఎలా అందించాలనే అంశంపై చర్చించారు. గ్యాస్‌ ఏజెన్సీలతో చర్చలు జరపాలని సీఎం సూచించారు. గృహ జ్యోతి పథకం కింద జీరో బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు. 
 
ముఖ్యంగా, ప్రజాపాలన దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇవ్వాలి. లబ్ధిదారుడు రూ.500 చెల్లిస్తే సిలిండర్‌ ఇచ్చేవిధంగా అనువైన విధానాన్ని అనుసరించాలి. సబ్సిడీని ఖాతాకు బదిలీ చేయాలా? ఏజెన్సీలకు చెల్లించాలా? అనుమానాలు, అపోహలకు తావు లేకుండా గృహజ్యోతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలి. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్తు బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలి సూచించారు. 
 
అలాగే, తెల్ల రేషన్‌ కార్డు ఉండి, 200 యూనిట్లలోపు గృహ విద్యుత్తు వినియోగించే వారందరికీ ఈ పథకం వర్తింపజేయాలి. ప్రజాపాలన దరఖాస్తుల్లో రేషన్‌ కార్డు నంబరు, విద్యుత్‌ కనెక్షన్‌ నంబరు తప్పుల కారణంగా జీరో బిల్లుకు అర్హత కోల్పోయినవారు ఉంటే.. సవరించుకునే అవకాశమివ్వాలి. అలాగే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని వారుంటే ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం నిరంతర ప్రక్రియగా కొనసాగించాలి’’ అని సీఎం ఆదేశించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు