గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 16కు పెరిగిన మృతుల సంఖ్య

ఠాగూర్

ఆదివారం, 18 మే 2025 (12:27 IST)
హైదరాబాద్ నగరంలోని చార్మినార్ సమీపంలోని గుల్జార్‌ హౌస్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంఖ్య 16 మందికి చేరింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. ప్రమాదంలో భవనంలో ఉన్న పలువురు ఊపిరాడక తుదిశ్వాస విడిచారు. దీంతో వారిని ఉస్మానియా, యశోద (మలక్ పేట), డీఆర్డీవో, అపోలో ఆస్పత్రులకు తరలించారు. కొందరు ఘటనాస్థలంలో మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. 
 
షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, పోలీస్ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకున్నారు. భవనంలో ఉన్న మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. గుల్జార్ హౌస్‌ పరిససరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు. 
 
ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో రాజేంద్ర కుమార్, అభిషేక్ మోడీ, సుమిత్ర, మున్నీబాబు, ఆరుషి జైన్, శీతల్ జైన్, ఇరాజ్, హర్షాలీ గుప్తా, రజని అగర్వాల్, అన్య మోదీ, పంకజ్ మోదీ, వర్ష మోదీ, రిషబ్, ప్రథమ్ అగర్వాల్, ప్రాంశు అగర్వాల్‌లు ఉన్నారు. 
 
అగ్ని ప్రమాదం ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 18 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరోవైపు, ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు