హైదరాబాద్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ.. నిందితుల్లో మాజీ మంత్రి సోదరుడు

ఠాగూర్

శుక్రవారం, 17 అక్టోబరు 2025 (09:58 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ రేవ్ పార్టీలో భారత రాష్ట్ర సమితికి చెందిన నాంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి సోదరుడు వంటి ప్రముఖులు పోలీసులకు చిక్కడం ఇపుు చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా మంచాల పోలీసులు జరిపిన ఈ ఆకస్మిక సోదాల్లో మొత్తం 33 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెల్సిందే. 
 
పోలీసుల కథనం మేరకు.. మంచాల మండలం లింగంపల్లి శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో భారీ శబ్దాలతో పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి, కొందరు మద్యం తాగుతూ యువతులతో అసభ్యకర నృత్యాలు చేస్తూ కనిపించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ పార్టీలో బీఆర్ఎస్ నేత చందపేట ఆనందకుమార్ గౌడ్ (63), గన్ ఫౌండ్రీ మాజీ కార్పొరేటర్ మధుగౌడ్ (57) తో పాటు పలువురు రియల్టర్లు, వ్యాపారులు, కాంట్రాక్టర్లు ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 25 మంది పురుషులు, 8 మంది మహిళలను అరెస్టు చేశారు.
 
కాచిగూడకు చెందిన వ్యాపారి రుద్రశెట్టి సప్తగిరి (49) తన స్నేహితుల కోసం ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు విచారణలో తేలింది. నృత్యాల కోసం ముంబై, పశ్చిమబెంగాల్, గాజువాక ప్రాంతాల నుంచి 8 మంది మహిళలను రప్పించాడు. ఒక్కో మహిళకు రూ.5 వేలు చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. ఈ పార్టీకి ఎలాంటి మద్యం అనుమతులు లేవని స్పష్టం చేశారు.
 
సంఘటనా స్థలం నుంచి రూ.2.45 లక్షల నగదు, 25 సెల్‌ఫోన్లు, 11 కార్లు, 27 మద్యం సీసాలు, సౌండ్ సిస్టమ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన అందరినీ విచారణ అనంతరం స్టేషన్ బెయిలుపై విడుదల చేశారు. నగర శివార్లలో ప్రముఖుల ఆధ్వర్యంలో ఇలాంటి పార్టీ జరగడం స్థానికంగా కలకలం సృష్టించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు