ఎల్బీ నగర్ - హయత్ నగర్ మెట్రో మార్గంలో 6 రైల్వే స్టేషన్లు!!

వరుణ్

శుక్రవారం, 12 జులై 2024 (13:47 IST)
హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ - హయత్ నగర్ మెట్రో మార్గంలో ఆరు రైల్వే స్టేషన్లు రానున్నాయి. దాదాపు 7 కిలోమీటర్ల దూరం ఉండే ఈ మార్గంలో సగటున కిలోమీటరుకు కాస్త అటుఇటుగా ఒక స్టేషన్‌ను ప్రతిపాదించారు. 
 
జాతీయ రహదారి కావడం, కొన్ని చోట్ల ఫ్లైఓవర్ల నిర్మాణం జరుగుతున్న దృష్ట్యా మెట్రో స్టేషన్లు నిర్మించే ప్రాంతాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రహదారికి ఎటువైపు ఉన్నా మెట్రో స్టేషన్‌కు సులువుగా చేరుకునేందుకు వీలుగా వాటి స్థానాలను సర్దుబాటు చేస్తున్నారు. 
 
ఈ మేరకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) రూపకల్పనకు జాతీయ రహదారుల సంస్థతో కలిసి మెట్రోరైలు అధికారులు తుదిరూపు ఇచ్చారు.
 
 మెట్రోరైలు రెండోదశలో వేర్వేరు మార్గాల్లో 70 కిలోమీటర్ల నిర్మాణాన్ని ప్రతిపాదించారు. 
 
డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇందులో ఎల్బీనగర్ - హయతనగర్ మార్గం ఒకటి. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు ఉన్న కారిడార్-1కి పొడిగింపు ఇది. ఈ మార్గంలో చింతలుంట వద్ద ఒక స్టేషన్ రానుంది. 
 
ఎల్బీనగర్ నుంచి చింతల్ కుంట వరకు సెంట్రల్ మీడియన్‌లోనే (మధ్యలోనే) మెట్రోరైలు మార్గం ఉంటుంది. మిగతా 5 స్టేషన్లు ఎక్కడెక్కడ అనే వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.
 
చింతలకుంట నుంచి హయతనగర్ మధ్య జాతీయ రహదారుల సంస్థ ఫ్లైఓవర్లు నిర్మిస్తోంది. ఈ కారణంగా ఎడమవైపు సర్వీస్ రోడ్డులో మెట్రోరైలు మార్గం రానుందని మెట్రో అధికారులు తెలిపారు. 
 
హయత్ నగర్ నుంచి నిత్యం ఎంతోమంది నగరంలోని వేర్వేరు ప్రాంతాలు, ఐటీ కారిడారు రాకపోకలు సాగిస్తుంటారు. రహదారిపై రద్దీ దృష్ట్యా గంటల తరబడి ట్రాఫిక్‌లోనే గడపాల్సి వస్తోంది. మెట్రో రాకతో ప్రయాణం సులభతరంకానుంది. ఐటీ కారిడార్ వరకు అనుసంధానం ఏర్పడనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు