తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రవర్గాన్ని విస్తరించారు. కొత్తగా ముగ్గురికి చోటు కల్పించారు. వీరిలో గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు ఉన్నారు. వీరంతా ఆదివారం కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగిన మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో వీరితో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్, మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీవరిలు ఉన్నారు.
తాజా విస్తరణలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే అవకాశం కల్పించింది. కాగా, ఈ దఫా మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు చోటు దక్కుతుందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే, ప్రస్తుతానికి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలన్న అధిష్టానం సూచనతో ముఖ్యమంత్రి ఆ మూడు సామాజిక వర్గాలకు మాత్రమే అవకాశం కల్పించారు.