తెలంగాణలో భారీ వర్షాలు.. జూలై 12 నుంచి ఎల్లో అలర్ట్‌ జారీ

సెల్వి

గురువారం, 11 జులై 2024 (19:26 IST)
తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. జూలై 12 నుంచి ఎల్లో అలర్ట్‌ జారీ చేయడం జరిగిందని 
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీచేయడంతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఐఎండీ హెచ్చరించింది. జూన్ 12 నుండి 15 వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. 
 
బలమైన నైరుతి రుతుపవనాలకు తోడు.. సముద్ర మట్టానికి 3.1కి.మీ. నుంచి 7.6 కి.మీ. మధ్యలో ఆవర్తనం కొనసాగుతున్నదని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఏపీ తీరం వద్ద పశ్చిమ-మధ్య బంగాళాఖాతం ఆనుకొని కేంద్రీకృతమైన ఆవర్తనం బలహీనపడిందని, దీని ప్రభావంతో తెలంగాణలోని 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
 
నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కుమ్రంభీం-ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌, హనుమకొండ, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. గంటకు 30-40కి.మీ. వేగంతో గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉన్నదని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు