తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి.. మరో రెండు నెలల్లో పంచాయతీ పండుగ

గురువారం, 7 డిశెంబరు 2023 (09:10 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి గత నెలలో ఎన్నికలు జరగ్గా.. ఈ నెల మూడో తేదీన ఫలితాలు వెల్లడయ్యాయి. గురువారం ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. అయితే, మరో రెండు నెలల్లో ఆ రాష్ట్రంలో మరో ఎన్నికల పండగ జరుగనుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీకాలం వచ్చేయేడాది జనవరి 31వ తేదీతో ముగియనుంది. దీంతో జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. 
 
ఇందుకు సంబంధించి సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల వివరాలతో జిల్లాల వారీగా రిపోర్ట్ సిద్ధం చేయాలంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్ కుమార్ ఈ మేరకు లేఖ పంపించారు. డిసెంబర్ 30లోపు కసరత్తు పూర్తిచేసి వివరాలు అందించాలని కోరారు. ఓటర్ల సంఖ్యను బట్టి గ్రామాల్లో పోలింగ్ స్టేషన్ల ఎంపిక, పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లో వివరాలు నమోదు చేయడం వంటి వాటిపై కలెక్టర్లకు కీలకమైన సూచనలు చేశారు. 
 
సర్పంచ్, వార్డ్ మెంబర్ల రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను గ్రామ కార్యదర్శులు ఎన్నికల సంఘానికి పంపించారు. కాగా, తెలంగాణలో మొత్తం 12 వేలకు పైగా గ్రామ పంచాయితీలు, లక్షా 13 వేలకు పైగా వార్డులు ఉన్నాయి. అయితే ఇవి ముందస్తు ఏర్పాట్లు మాత్రమేనని ఎన్నికల సంఘం అధికారి ఒకరు చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు ఉంటాయనేది కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఎందుకంటే వచ్చే యేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు