కొలువుదీరిన కొత్త శాసనసభ - ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్

శనివారం, 9 డిశెంబరు 2023 (10:16 IST)
తెలంగాణ రాష్ట్ర కొత్త కొత్త శాసనసభ శనివారం కొలువుదీరింది. ప్రొటెం స్పీకరుగా అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత మూడో అసెంబ్లీ మొదటి సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం శనివారం జరుగుతుంది. మూడు, నాలుగు రోజుల విరామం తర్వాత సభ తిరిగి సమావేశం కానుంది. 
 
సభాపతి ఎన్నిక, గవర్నర్ ప్రసంగం అప్పుడు ఉంటాయి. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ సభ్యులచే ప్రమాణం చేయిస్తారు. అంతకుముందు రాజభవన్‌లో అక్బరుద్దీన్‌తో గవర్నర్ ప్రమాణం చేయిస్తారు. శాసనసభాపతి ఎన్నిక కోసం వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ శనివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
 
రాష్ట్ర మూడో శాసనసభ శనివారం కొలువుతీరనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల పేర్లతో ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ జారీచేశారు. 64 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా 39 చోట్ల బీఆర్ఎస్ గెలుపొందింది. బీజేపీ 8, మజ్లిస్ 7 స్థానాల్లో విజయం సాధించగా, సీపీఐ ఒకచోట గెలుపొందింది. నూతన శాసనసభ్యులతో కొత్త శాసనసభ ఏర్పాటైంది. మంత్రివర్గ సిఫారసు మేరకు శాసనసభను సమావేశపరుస్తూ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ నోటిఫికేషన్ జారీ చేశారు.
 
ఉదయం 11 గంటలకు కొత్త అసెంబ్లీ మొదటి సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అసెంబ్లీకి సభ్యులుగా ఎన్నికైన వారు శనివారం ప్రమాణస్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారంతోపాటు సభా కార్యకలాపాల కోసం ప్రొటెం స్పీకర్‌ను నియమించారు. చాంద్రాయణగుట్ట నుంచి 1999 మొదలు ఇప్పటివరకు వరుసగా ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన సీనియర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్‌ను నియమించారు.
 
ముందుగా సభానాయకుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఉపముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఆ తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ఉంటుంది. స్పీకర్ ఎన్నికకి శనివారం నోటిఫికేషన్ జారీచేస్తారు. సభాపతి పదవి కోసం ప్రతిపాదనల స్వీకరణ ఉంటుంది. వికారాబాద్ శాసనసభ్యుడు గడ్డం ప్రసాద్ కుమార్ పేరును కాంగ్రెస్ ఇప్పటికే స్పీకర్‌గా ఖరారు చేసింది. ఆయన ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నేటి సమావేశం తర్వాత సభకు మూడు, నాలుగురోజుల విరామం ఉండే అవకాశం ఉంది. తిరిగి సమావేశం అయ్యాక సభాపతి ఎన్నిక చేపడతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు