దేశంలో జమిలి ఎన్నికలు తథ్యం.. అమలుకు ప్రత్యేక కమిటీ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఠాగూర్

గురువారం, 19 సెప్టెంబరు 2024 (15:58 IST)
దేశంలో జమిలి ఎన్నికలు తథ్యమని, ఈ ఎన్నికల నిర్వహణ, అమలు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పేరుతో దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఆమోదముద్ర వేసిన విషయం తెల్సిందే. దీనిపై మంత్రి కిషన్ రెడ్డి గురువారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 
 
'దేశవ్యాప్తంగా ఐదేళ్ల పాటు ఏదో ఒకచోట పోలింగ్‌ జరుగుతున్నందున ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం, తద్వారా విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేక ప్రభుత్వ నిర్ణయాలకు ఆటంకంగా మారాయన్నారు. కొన్నిసార్లు సాధారణ నిర్ణయాలు కూడా తీసుకోలేని పరిస్థితి ఏర్పడినట్లు చెప్పారు. 
 
2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అసెంబ్లీలు, పార్లమెంటుకు జరుగుతున్న ఎన్నికలకు చమరగీతం పాడి జమిలి ఎన్నికలు జరపాలని నిర్ణయించడం స్వాగతించదగిన పరిణామం అన్నారు. 
 
ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభల కారణంగా.. ట్రాఫిక్ జామ్‌, ధ్వని కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వేర్వేరుగా ఎన్నికల నిర్వహణ కారణంగా ఖజానాపై ఆర్థికంగా భారం పడుతోందన్నారు. పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడంతో జరుగుతున్న ఖర్చు రూ.4,500 కోట్ల పైమాటేనన్నారు. జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్రమంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై.. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. ప్రస్తుతం వ్యతిరేకిస్తున్న పార్టీలు త్వరలోనే దీనికి సహకరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు