మహిళ కడుపులో 3 కేజీల వెంట్రుకల గడ్డ

శనివారం, 25 సెప్టెంబరు 2021 (10:25 IST)
తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ కడుపులో 3 కేజీల వెంట్రుల గడ్డను వైద్యులు గుర్తించి ఆపరేషన్ ద్వారా దాన్ని తొలగించారు. గత కొన్ని రోజులుగా కడుపునొప్పితో బాధపడుతూ వచ్చిన ఈ మహిళకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. వెంట్రుకలు ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత ఆ మహిళకు శస్త్రచికిత్స చేసి 3 కిలోల వెంట్రుకల గడ్డను బయటకు తీశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం బూచన్‌పల్లికి చెందిన శ్రీలత(20) కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ వచ్చింది. పలు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండాపోయింది. కుటుంబీకులు ఆమెను ఈనెల 17న సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేర్పించారు. 
 
డాక్టర్‌ కొత్తపల్లి కిరణ్‌కుమార్‌, డాక్టర్‌ యాదగిరి పరీక్షలు చేసి శ్రీలత కడుపులో గడ్డ ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం శస్త్రచికిత్స చేసి వెంట్రుకలతో కూడిన మూడు కిలోల వెంట్రుకల గడ్డను బయటకు తీశారు. ప్రస్తుతం శ్రీలత క్షేమంగా ఉంది. ఆమెకు మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. 
 
చిన్నప్పటి నుంచి మానసిక ఒత్తిడి, ఒంటరితనం తదితర కారణాలతో కొందరిలో వెంట్రుకలు తినడం అలవాటుగా మారుతుందని డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు. శ్రీలత మట్టి, సున్నం సైతం తినడం వల్ల కడుపులో వెంట్రుకలు గడ్డగా మారాయని వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు