ప్రియుడితో కలిసి ఎయిడ్స్ సోకిన భర్తను హత్య చేసిన ఇల్లాలు

గురువారం, 15 నవంబరు 2018 (12:53 IST)
ఎయిడ్స్ వ్యాధి ఉన్న భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ ఇల్లాలు. రాచకొండ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం రాజమండ్రికి చెందిన తోట దుర్గారావుకు  భార్యాపిల్లలు ఉన్నా అదే ప్రాంతానికి చెందిన లావణ్యను రెండో పెళ్లి చేసుకుని కాకినాడకు దగ్గరలో కాపురం పెట్టారు. దుర్గారావుకు హెచ్‌ఐవీ సోకిందని తెలిసుకున్న లావణ్య, తన బంధువైన రామకృష్ణతో పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం కొనసాగించింది.
 
అయితే రామకృష్ణ బతుకుదెరువు కోసం హైదరాబాద్ నేరెడ్‌మెట్‌కు కుటుంబంతో సహా వచ్చి ఓ సంస్థలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 2018 సెప్టెంబరులో దుర్గారావు, లావణ్య దంపతులు సైతం నగరానికి రాగా రామకృష్ణ వారికి అద్దె ఇల్లు, దుర్గారావుకు పని ఇప్పించి లావణ్యతో  వివాహేతర బంధాన్ని కొనసాగించాడు. అనుకోకుండా ఒక రోజు లావణ్య-రామకృష్ణలు ఒకే గదిలో దుర్గారావుకు  కంటపడటంతో గొడవపడ్డాడు దుర్గారావు. దీంతో లావణ్య చేతికి అందిన ఇనుప రాడ్డుతో భర్త తలపై కొట్టింది. 
 
వెంటనే ప్రియుడితో కలిసి చున్నీతో భర్త మెడకు ఉరి బిగించి హత్య చేసింది. మరుసటిరోజు రామకృష్ణ ఓ వ్యాను తీసుకొచ్చి శవాన్ని కీసర హైవేలో చెట్ల పొదల్లో పడేసి వెళ్లిపోయారు. లావణ్య పిల్లలను తీసుకుని కాకినాడకు వెళ్లిపోయింది. ఈ నెల 2న స్థానికులు ఇచ్చిన సమాచారంతో సీసీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు రామకృష్ణను నిలదీయడంతో బండారం బట్టబయలైంది. దీంతో నిందితునితో పాటు లావణ్యను సైతం పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు