గద్దర్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు వద్దు : ఏటీఎఫ్

సోమవారం, 7 ఆగస్టు 2023 (11:39 IST)
ప్రజాగాయకుడు గద్దర్‌కు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడం నక్సలైట్ (మావోయిజం) వ్యతిరేఖ పోరాటంలో అమరులైన పోలీసులు, పౌరుల త్యాగాలను అవమానించడమేనని యాంటి టెర్రరిజం ఫోరం కన్వీనర్ రావినూత శశిధర్ అన్నారు. అందువల్ల గద్దర్‌కు అత్యంక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించవద్దని కోరారు. 
 
ఇదే అంశంపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గద్దర్ తన విప్లవ పాటల ద్వారా వేలాది మంది యువకులను నక్సలైట్ ఉద్యమం వైపు మళ్ళించిన వ్యక్తి అని అన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టిన నక్సల్స్ ఉద్యమం వేలాది మంది పోలీసులను బలితీసుకుందని, నక్సలిజం (మావోయిజం) సాధారణ పౌరులపై, జాతీయవాదులపై కూడా దాడులు జరిపి అనేక మంది ప్రాణాలు తీసిందని తెలిపారు. 
 
ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేఖంగా సాయిధ పోరాటాలు చేయడానికి తన సాహిత్యం ద్వారా యువతను దేశ ద్రోహులుగా తయారు చేసిన గద్దర్ లాంటి ఒక వ్యక్తికి నేడు తెలంగాణా ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడం తీవ్రంగా ఖండించదగిన చర్యగా ఆయ అభివర్ణించారు.  ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్య పరిరక్షణలో, శాంతి భద్రతల పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను, ప్రజల త్యాగాలను అవమానించడమే అవుతుందని గుర్తుచేశారు. 
 
ప్రభుత్వ నిర్ణయం పోలీసు బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజాస్వామ్యవాదులు ప్రతి ఒక్కరు ఖండించాలి, పోలీసు అమరవీరుల కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయంతో తీవ్రంగా కలత చెందుతున్నాయి. పోలీసు అధికారుల సంఘం కూడా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంపై నోరు విప్పి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోనేలా చూడాలని కోరుతున్నట్టు ఆయన తెలిపారు. 
 
దీనిని ఒక వ్యక్తికి జరుగుతున్న అంత్యక్రియలుగా మాత్రమే చూడకూడదని అధికారికంగా అంత్యకియలు జరిపితే ప్రభుత్వం నక్సలైట్ (మావోయిజం) భావజాలానికి పోలీసు బలగాలతో అధికారికంగా సెల్యూట్ చేయించడమే అవుతుంది. వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏటీఎఫ్ (యాంటి టెర్రరిజం ఫోరం) డిమాండ్ చేస్తుందని ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు