సీఎం కేసీఆర్‌కు షాకిచ్చిన భారాస ఎమ్మెల్యే రేఖా నాయక్

మంగళవారం, 22 ఆగస్టు 2023 (16:16 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్‌కు ఆ పార్టీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ తేరుకోలేని షాకిచ్చింది. ప్రస్తుతం ఆమె ఖనాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాజాగా ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో ఆమె ఖంగుతిన్నారు. అంతేకాకుండా, కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు టిక్కెట్ ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. 
 
సీఎం కేసీఆర్ తనకు టిక్కెట్ ఇవ్వక పోవడంతో మంగళవారం కార్యకర్తలు, అనుచరుల వద్ద కన్నీటిపర్యంతమయ్యారు. ఎవరు మోసం చేసినా నియోజకవర్గ ప్రజలు మాత్రం తనను మోసం చేయరని వారంతా తన వెంటే ఉంటారని తీవ్ర భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. భారాసా టికెట్ నిరాకరించడంతో ఆమె కాంగ్రెస్ టిక్కెట్ కోరుతూ దరఖాస్తు చేశారు. ఈ మేరకు తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ ఆమె దరఖాస్తును తన వ్యక్తిగత పీఏతో గాంధీ భవన్‌కు పంపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే టిక్కెట్ కోసం కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. 
 
అంతకుముందు సోమవారం సాయంత్రమే రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ మరుసటి రోజే ఆయన భార్య కూడా కాంగ్రెస్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. 
 
కాగా, గత 2014తో పాటు 2018లోనూ ఖానాపూర్ నుంచి బీఆర్ఎస్ టిక్కెట్‌పై రేఖానాయక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. కిందటి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎస్టీ కోటాలో తనకు మంత్రి పదవి దక్కుతుందని గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ, అపుడు మంత్రి పదవి దక్కకపోగా, ఇపుడు ఏకంగా టిక్కెట్ కూడా ఇవ్వలేదు. దీంతో భారాసపై ప్రతీకారం తీర్చుకుంటానని రేఖా నాయక్ శపథం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు