ఆన్‌లైన్ క్లాసులు తెచ్చిన తంటా.. చదువుల నిలయంగా శ్మశానం

గురువారం, 16 సెప్టెంబరు 2021 (13:28 IST)
కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థుల చదువులు ఆటకెక్కాయి. పాఠశాలలు మూతపడటంతో ఆన్‌లైన్ విద్యా బోధనకు ప్రభుత్వాలు మొగ్గుచూపించాయి. దీంతో ఇపుడు ఆన్‌లైన్ తరగతులు జోరుగా సాగుతున్నాయి. అయితే, అనేక మారుమూల గ్రామాల్లో ఆన్‌లైన్ తరగతులకు ఇంటర్నెట్ పెద్ద సమస్యగా మారింది. 
 
దీంతో విద్యార్థులు మొబైల్ సిగ్నల్ కోసం ఎత్తైన చెట్లు, భవనాలపై ఎక్కి కూర్చొంటున్నారు. ఇపుడు ఓ శ్మశానం చదువుల కొలువుగా మారింది. మహబూబాబాద్ జిల్లాలో ఓ వైకుంఠ ధామం ఆన్‌లైన్ చదువుల నిలయంగా మారిపోయింది. సెల్‌ఫోన్‌కు సిగ్నల్ లేకపోవడంతో ఆ విద్యార్థికి వైకుంఠ ధామమే దిక్కయింది.
 
ఈ జిల్లాలోని గంగారం మండలం మడగూడెంకు చెందిన రోహిత్ అనే యువకుడు మధ్యప్రదేశ్‌లోని ఓరియంటల్ వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీ సెకండ్ ఇయర్ చదవుతున్నాడు. కరోనా కారణంగా ఆ రాష్ట్రంలో కళాశాలలు క్లోజ్ చేశారు. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే వాటిని వినేందుకు రోహిత్ ఫోన్‌లో సిగ్నల్ సహకరించడం లేదు. అతడు సిగ్నల్ కోసం వెతకని ప్రాంతం లేదు. 
 
చివరికు మడగూడెం శివారులోని వైకుంఠ ధామంలో సిగ్నల్ వస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడే కూర్చొని వైకుంఠ ధామంతో ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్నాడు. చదువు మీదున్న ఆసక్తితో శవాలను దహనం చేసేచోటే ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే విద్యాబోధన సాగిస్తున్నాడు. బ్రతుకులు ముగిసే చోట.. అతడు తన జీవితానికి వెలుగులు వెతుక్కుంటున్నాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు