చివరి పరీక్షే మిగిలింది.. కానీ మృత్యువు కబళించింది..

బుధవారం, 13 మార్చి 2019 (18:50 IST)
పరీక్షలన్నీ అయిపోయాయి, చివరి పరీక్ష మాత్రం మిగిలి ఉంది, దానిని వ్రాసిన తర్వాత స్నేహితులతో కలిసి ఆనందంగా గడపాలనుకున్నారు ఇద్దరు స్నేహితులు. ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. పరీక్షకు హాజరుకాబోయే ముందు వారిని మృత్యువు కబళించింది. ఒకరు అక్కడిక్కడే చనిపోగా, మరొకరు చావు అంచు వరకూ వెళ్లాడు. 
 
వివరాల్లోకి వెళితే.. మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన సయ్యద్‌ ఫౌజన్, యూసుఫ్‌గూడ సమీపంలోని శ్రీరాంనగర్‌లో నివసించే మహ్మద్‌ షహీర్‌ సుభాన్‌ స్నేహితులు. ఇద్దరూ సోమాజిగూడలోని రూట్స్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నారు. మంగళవారం చివరి పరీక్ష ఉండగా ఫౌజన్‌ తన ద్విచక్రవాహనంలో పరీక్ష కేంద్రానికి బయలుదేరాడు.
 
శ్రీరాంనగర్‌కు వచ్చి సుభాన్‌ను ఎక్కించుకున్నాడు. ఇద్దరూ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.1 మీదుగా వెళ్తున్నారు. సికింద్రాబాద్‌ నుంచి కొండాపూర్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సు జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద పెద్దమ్మ గుడివైపు మళ్లుతూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. 
 
కుర్రాళ్లతో సహా బండిని అలాగే కొంత దూరం ఈడ్చుకుని వెళ్లింది. బస్సు ముందరి చక్రం వెనుక కూర్చున్న సుభాన్‌‌పై ఎక్కగా అక్కడికక్కడే మృతిచెందాడు. వాహనం నడిపిన ఫౌజన్‌ తీవ్ర గాయాలై జూబ్లీహిల్స్‌లోని ఆసుపత్రిలో చేరాడు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు